మన పాలన .. మీ సూచన .. ఏడాది పాలనపై జగన్ సదస్సుల లక్ష్యం ఇదే ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి తెరతీశారు . వైసీపీ ఏడాది పాలనపై విభిన్న వర్గాల ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలు తెలుసుకుని , సలహాలు , సూచనలు తీసుకుంటున్నారు సీఎం జగన్ . మన పాలన మీ సూచన పేరుతో ఆయన మరింత పారదర్శక పాలనకు , అలాగే ప్రజలకు మరింత చేరువ కావటానికి ఏం చెయ్యాలో నేరుగా తెలుసుకుంటున్నారు.
వైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదే
పరిపాలన సంస్కరణలు-సంక్షేమంపై జరిగిన సదస్సు
ఏడాది కాలంగా వై సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు , అలాగే వివిధ పథకాల అమలు తీరుపై సదస్సులు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం మేరకు మన పాలన మీ సూచన కార్యక్రమాన్ని నిర్వహించి మెరుగైన పాలనకు ఈ సదస్సుల ద్వారా సూచనలు ,సలహాలు తీసుకుంటున్నారు సీఎం జగన్ . 25న పరిపాలన సంస్కరణలు-సంక్షేమం పై సదస్సు నిర్వహించారు .
గ్రామ సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్లతో మాట్లాడిన జగన్
వైసీపీ పాలన సాగిస్తున్న నాటి నుండి వివిధ రంగాలలో చేపట్టిన పాలనా సంస్కరణలపై , అలాగే అందిస్తున్న సంక్షేమంపై నిర్వహించిన ఈ సదస్సులో గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొని గ్రామాలలో అందుతున్న సంక్షేమ పథకాలను , సీఎం జగన్ గ్రామాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు. తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై కూడా వారు సీఎం జగన్ తో మాట్లాడారు . క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకుని సీఎం జగన్ వాటిని నోట్ చేసుకున్నారు .
నేడు వ్యవసాయం-అనుబంధ రంగాలపై సదస్సు
ఇక 26న అంటే నేడు వ్యవసాయం-అనుబంధ రంగాలపై సదస్సు జరగనుంది . ‘మన పాలన-మీ సూచన' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా నేడు జరగనున్న సమీక్షలో సైతం సీఎం జగన్ పాల్గొంటారు . ఈ సదస్సుకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమన్వయ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇక సదస్సుకు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు 13 జిల్లాల నుంచి 24 మంది రైతులు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన 14 మంది నిపుణులు, ఆక్వా, డెయిరీ రంగ ప్రముఖులు తదితరులు హాజరవుతున్నారు.
మరింత మెరుగైన పాలన కోసమే మన పాలన మీ సూచన
ఇలా రోజుకో రంగంపై సదస్సు నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవి అమలవుతున్న తీరు , ప్రజల నుండి వస్తున్న స్పందన తెలుసుకుని , స్వయంగా మరింత ప్రజలకు చేరువగా పాలన సాగించటానికి కావలసిన అన్ని చర్యలు చెప్పట్టే ఉద్దేశంతోనే సీఎం జగన్ మన పాలన మీ సూచన పేరుతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు . అందుకే నేరుగా అన్ని రంగాలకు సంబంధించిన అధికారుల దగ్గర నుండి సామాన్య జనం వరకు అందరితో ఆయన సమావేశం అవుతున్నారు. గతంలో చంద్రబాబు ఎక్కువగా సర్వేలు చేయించేవారు . అయితే సీఎం జగన్ మాత్రం ఏ అంశం అయినా నేరుగా తెలుసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు .