విశాఖపై తన మనసులో మాటను వెల్లడించిన వైఎస్ జగన్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాలేజ్
అమరావతి: సాగర నగరం విశాఖపట్నంపై తనకు ఉన్న ప్రేమాభిమానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రదర్శించారు. ఆ నగరంపై తనకు ఉన్న అభిప్రాయాన్ని, మనసులో మాటను బహిర్గతం చేశారు. ఇదివరకు కూడా విశాఖ గురించి ఆయన పలుమార్లు వేర్వేరు వేదికలపై ప్రస్తావించారు. అయినప్పటికీ.. ఈ సారి వాటన్నింటి కంటే భిన్నంగా తన భావాలను వ్యక్తీకరించారు. ఆ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటున్నానీ స్పష్టం చేశారు. కొన్ని వరాలను కూడా కురిపించారు.
వైజాగ్లో హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్
విశాఖపట్నంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి కళాశాలను నెలకొల్పబోతున్నామని వైఎస్ జగన్ ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కళాశాల ఏర్పాటవుతుందని చెప్పారు. రాష్ట్ర యువతకు వేర్వేరు రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే దీన్ని అక్కడ స్థాపించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి- అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలను సాధించేలా, ఐటీ రంగంలో నెలకొన్న పోటీ వాతావరణాన్ని అధిగమించేలా యువతను తీర్చిదిద్దుతామని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ లెర్నింగ్
విశాఖలో నెలకొల్పబోయే నైపుణ్యాభివృద్ధి కళాశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు, వర్చువల్ లెర్నింగ్లతో విద్యాబోధన కొనసాగుతుందని వైఎస్ జగన్ అన్నారు. అలాంటి కళాశాలను ప్రభుత్వమే పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ కళాశాల ఓ వేదిక అవుతుందని అన్నారు.
టయర్-1 సిటీ హోదా గల నగరం అదొక్కటే..
రాష్ట్రంలో అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్ధడానికి అవకాశం ఒకే ఒక్క నగరం విశాఖపట్నమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. టయర్-1 హోదా గల నగరం అదొక్కటి మాత్రమేనని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఆ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అనుకూలమైన వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులు విశాఖపట్నంలో ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడే సామర్థ్యాలు విశాఖకు ఉన్నాయని స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్య
త్వరలో విశాఖపట్నంలో నెలకొల్పబోయే ఈ హైఎండ్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో నాణ్యమైన విద్యాను బోధిస్తామని, వారిని ఐటీ రంగంలో మేటి నిపుణులుగా రూపుదిద్దుతామని జగన్ వెల్లడించారు. వారందరూ విశాఖలోనే ఉంటూ తమ సేవలను రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగించేలా అవకాశాలను కల్పిస్తామని అన్నారు. వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్గా మార్చివేస్తామని చెప్పారు. ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వేరే నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని అన్నారు.