మా లెటర్లే చూపిస్తారు...మీరు రాసినవి ఎందుకు చూపించరు?:కుటుంబరావు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కేంద్రానికి మేం రాసిన ఉత్తరాలే చూపిస్తారు...మీరు రాసిన ఉత్తరాలు ఎందుకు చూపించరని ఆయన నిలదీశారు.
Recommended Video
ఎన్డీయే కూటమి నుంచి టిడిపి బయటకు వచ్చాక ప్రధాని మోడీ ఇంతవరకు నోరు విప్పలేదని కుటుంబరావు విమర్శించారు. ఎపికి అన్యాయం చేసిన విషయం తెలుసు కాబట్టే ఆయన నోరు విప్పలేకపోతున్నారని చెప్పారు. బిజెపిని ఇప్పుడు అందరూ జుమ్లా పార్టీ అంటున్నారని, ఆ పార్టీకి చెందిన రాజ్య సభ ఎంపి అన్నీ అబద్దాలే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఎంపి జీవీఎల్ నరసింహారావు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన భాజపా నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుకు తాను నోటీసులు పంపినట్టు చెప్పారు. బిజెపి నేతలు రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందనే భ్రమ ప్రజల్లో కల్పిస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. సాగరమాల కింద రూ.1800 కోట్లు ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసం రాష్ట్రానికి కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కుటుంబరావు స్పష్టంచేశారు. సాగరమాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3750 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
ఎపి కోస్టల్ ఎకనమిక్ జోన్ ఊసేలేదన్నారు. 592 ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి 104 ప్రాజెక్టులు కేటాయించామని చెప్పడం అబద్ధమన్నారు. గృహ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.