ఇవి కావాలి: కెసిఆర్ను కల్సిన అసద్, హరికృష్ణ వివరణ
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, ఆయన సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
తాము కెసిఆర్ను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. తమకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు. తాము కెసిఆర్కు కొన్ని సూచనలు చేశామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మజ్లిస్ సహకారం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలన్నారు.
హైదరాబాదులో శాంతిభద్రతలను కాపాడాలన్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు తాగు, సాగు నీరు ఇవ్వాలన్నారు. ఉస్మానియా వైద్యశాలకు మరిన్ని నిధులు ఇవ్వాలన్నారు. తెలంగాణ లోగోలో చార్మినార్ ఉండాలని కోరారు. పాతబస్తీలో వెయ్యికోట్లతో తాగునీటి వసతు, వంద వార్డులతో ఎంసిహెచ్ను పునరుద్ధరించాలన్నారు. కెసిఆర్ను ఉద్యోగ సంఘాల నేతలు, సిఎస్ మహంతి, పలువురు ఉన్నతాధికారులు కలిశారు.
అంతరార్థం లేదు: హరికృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్న కెసిఆర్ను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చెప్పారు. ఇందులో ఎలాంటి అంతరార్థం లేదన్నారు. కెసిఆర్కు శుభాకాంక్షలు తెలియజేశాననన్నారు.