పెంపుడు కుక్కకు అంత్యక్రియలు, కాశీకి వెండి బొమ్మతో దంపతులు
రాజమండ్రి:పెంపుడు జంతువును స్వంత బిడ్డ మాదిరిగానే చూసుకొన్నారు ఆ కుటుంబసభ్యులు. వీధికుక్కల దాడిలో చికిత్స పొందుతూ మరణించిన కుక్కను తమ బిడ్డ మాదిరిగానే అంత్యక్రియలు నిర్వహించారు దంపతులు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో చోటుచేసుకొంది.
రాజమండ్రి పట్టణంలోని బొమ్మూరు వెంకటేశ్వర నగర్ కు చెందిన వెంపాటి శేషావతరం, ఆయన భార్య మంగాదేవి లు ఓ కుక్కను పెంచుకొంటున్నారు.
శేషావతరం ఉపాధ్యాయుడుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య మంగాదేవి ఆసుపత్రిలో పనిచేసేది. వీరికి కుక్కలంటే ప్రేమ.
కుక్కలను తమ బిడ్డల మాదిరిగా చూసుకొంటారు. బిడ్డలకు ఏ రకంగా అవసరాలు తీర్చుకొంటారో అదే తరహలో వారు కూడ పెంపుడు కుక్కను జాగ్రత్తగా తీసుకొంటారు.
పెంపుడు కుక్కను బిడ్డగా చూసుకొంటారు
శేషావతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన భార్య మంగాదేవి మాత్రం ఆసుపత్రిలో పనిచేసేది.అయితే 14 ఏళ్ళ క్రితం హుకుంపేటలోని ఓ ఆసుపత్రిలో ఆమె ఓ మహిళకు చికిత్స అందించింది. ఆ మహిళ మంగాదేవికి డబ్బులు ఇస్తుండగా ఆమె నిరాకరించింది.వారింట్లో జన్మించిన పప్పీ అనే కుక్క పిల్లను 2004 లో ఆమె అడిగి తీసుకొన్నారు. ఈ కుక్క పిల్లను ఈ దంపతులు తమ బిడ్డ మాదిరిగా చూసుకొన్నారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన సమయంలో కుక్కపై దాడి
ఇంతకాలంపాటు ఆ కుక్కకు ఎలాంటి లోటు లేకుండానే ఆ దంపతులు చూశారు.కుటుంబసభ్యుల మాదిరిగా కుక్క పిల్లను చూసుకొన్నారు.గత నెల 16వ, తేదిన కేరళ, కాశీ ఇతర పుణ్యక్షేత్రాలకు ఈ దంపతులు వెళ్ళారు. ఆ సమయంలో కుక్క పిల్లను రామకృష్ణనగర్ లోని అత్తవారింటి వద్ద వదిలివెళ్ళారు.అయితే గత నెల 19వ, తేదిన ఇంటి ఆవరణలో ఉన్న పప్పీపై వీధి కుక్కలు దాడి చేశాయి.
విజయవాడ ఆసుపత్రిలో కుక్కకు చికిత్స
వీధి కుక్కలు పప్పీపై దాడి చేసిన విషయం తెలుసుకొన్న మంగాదేవి కుమారుడు పృథ్వీ కుమార్తె రాధికలు విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో కుక్కకు చికిత్స చేయించారు. అయినా ఆ కుక్క కోలుకోలేదు.వైద్యులు కుక్కను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించారు.
మంగాదేవి ఒడిలోనే మరణించిన పప్పీ
తీర్థయాత్రలకు వెళ్ళిన శేషావతరం , మంగాదేవి దంపతులు గత నెల 29వ, తేదిన రాజమండ్రికి తిరిగివచ్చారు. అయితే పప్పీపై వీధి కుక్కలు దాడి చేసిన విషయం వారికి తెలిసి తల్లడిల్లిపోయారు. గత నెల 30వ, తేదినే పప్పీ మంగాదేవి ఒడిలోనే మరణించింది. దీంతో ఆమె తన స్వంత బిడ్డను కోల్పోయినంతగా రోధించింది. పప్పీని కోటిలింగాల రేవులో శ్మశానవాటికలో ఖననం చేశారు.
కుక్కకు దశదినకర్మలు నిర్వహించిన శేషావతరం దంపతులు
పప్పీని ఖననం చేసిన చోటే పురోహితులచేత పూజలు నిర్వహించారు. పదిరోజుల పాటు కుటుంబ సభ్యులు చనిపోతే ఏ రకంగా వ్యవహరిస్తారో అదే పద్దతులను పాటించారు.దాన ధర్మాలు చేశారు. జీవకారుణ్య సంఘంలోని వృద్దులకు అన్నదానం చేశారు.
పప్పీ రూపంలో వెండి బొమ్మ
పదమూడేళ్ళ పది నెలలపాటు స్వంత బిడ్డలా చూసుకొన్నారు. దాని ఆత్మశాంతి కోసం పప్పీరూపంలో వెండిబొమ్మను తయారు చేయించి కాశీలోని బైరవస్వామి ఆలయంలో ఉంచుతారు. దీని వల్ల పప్పీ ఆత్మకు శాంతి చేకూరుతోందని భావిస్తున్నట్టుగా శేషావతరం దంపతులు చెబుతున్నారు.