గ్రానైట్ క్వారీలపై ఏపీ సర్కారుకు షాక్... పెనాల్టీ ఆదేశాల రద్దు- ప్రభుత్వ చర్య్లలపై ఆగ్రహం..
ఏపీలో అక్రమాలకు పాల్పడిన గ్రానైట్ క్వారీలపై ప్రభుత్వం గతంలో జరిమానాలు విధించింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే గ్రానైట్ క్వారీలపై 2500 కోట్ల రూపాయల మేర పెనాల్టీ విధించారు. వీటి వసూలు కోసం ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించిన అధికారులు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నసమయంలోనూ నోటీసులపై స్పందించాలని క్వారీల యజమానులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరిలో ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలకు అక్రమాలకు సంబంధించిన జరిమానాల చెల్లింపు కోసం నోటీసులు ఇవ్వడం, వీటిపై స్పందించాలని అధికారులు ఒత్తిడి చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
లాక్ డౌన్ కొనసాగుతుండగా.. జరిమానాల చెల్లింపు కోసం ఒత్తిడి చేయడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసును విచారించిన ధర్మాసనం... నోటీసులకు క్వారీల యజమానులు ఇప్పటికిప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని తెలిపింది. లాక్ డౌన్ ముగిసి పరిశ్రమలు గాడిన పడిన తర్వాత ఈ కేసును మరోసారి విచారిస్తామని తెలిపిన ధర్మాసనం కేసు వాయిదా వేసింది.