సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు...మరోసారి ఏకగ్రీవ ఎన్నిక
పశ్చిమ గోదావరి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న 25 రాష్ట్ర మహాసభల్లో 60 మంది సభ్యులతో కార్యవర్గాన్ని నియమిస్తూ తీర్మానం చేశారు.
ఇందులో 10 మంది ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు, 15 మందితో కార్యదర్శి వర్గం, ఆహ్వానితులుగా 10 మంది, ప్రత్యేక ఆహ్వానితులుగా ఐదుగురు, జాతీయ మహాసభల ప్రతినిధులుగా 23 మంది నియమితులయ్యారని నూతన కార్యదర్శి పి.మధు తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ప్రసంగిస్తూ...వామపక్ష ప్రజాతంత్ర సంఘటనే లక్ష్యంగా రాష్ట్రంలో సీపీఎం ప్రజాపునాదిని పెద్దఎత్తున విస్తరించాలని, ముఖ్యంగా యువత వివిధ స్థాయిలో పార్టీలో ప్రధాన పాత్ర పోషించేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వామ పక్ష ఉద్యమానికి ఘనమైన చరిత్ర ఉందని, ఇప్పటికీ ఇక్కడ సీపీఎం బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్ ఎస్ఎస్ కాషాయ భావాలకు ప్రజానీకంలో పెద్దగా ఆద రణ లేదని, అయితే తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
అదే సమయంలో ప్రజాతంత్ర ఉద్యమాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ఇది ప్రత్యామ్నాయ రాజకీయాలకు అనుకూలమైన సమయమని గుర్తించి ప్రజా పోరాటాలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పోరాటాల్లో కలిసి వస్తున్న ప్రజానీకానికి రాజకీయ విద్యను అందించడం ద్వారా వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. వివిధ స్థాయిల్లోని పార్టీ కమిటీలలో యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.