కేశవ్ కు పదవి వచ్చెన్.. నేతల్లో చిచ్చు పెట్టెన్..! బాబుకు తల బొప్పికట్టెన్..!!
అమరావతి/హైదరాబాద్ : తెలగుదేశం పార్టీని సినిమా కష్టాలు ఆవహించాయి. సాధారణ ఎన్నికల్లో ఘోరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ అదికార పార్టీ నేతలతో అడుగడుగునా అవమానాలకు గురౌతున్నారు. అంతే కాకుండా రాక రాక వచ్చిన ఒక క్యాబినెట్ ర్యాంకు పదవి ఆ పార్టీలో ఆరని చిచ్చు రగిలిస్తోంది. అనుకున్నట్టే జరిగింది. టీడీపీలో ఆ ఒక పదవి ఆరని మంటలను రాజేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవికి పయ్యావుల కేశవ్ ను బాబు ప్రతిపాదించడమే సకల సమస్యలకు కారణమవుతోంది. అసలే అధికార వియోగంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు ఈ పదవిపై పెద్దగానే ఆశలు పెట్టుకున్నారు. ఉన్నది ఒక్క పదవి. పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా.. మిగతా వారు అలక పాన్పు ఎక్కడం ఖాయం. అధినేత చంద్రబాబుకు తలనొప్పి తథ్యం. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల మద్య ఇదే జరిగింది.
ఒక పదవి.. నాలుగు అలకలు..! టీడిపిలో విచిత్ర సంక్షోభం..!!
పీఏసీ చైర్మన్ పదవిని పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీలోని కొందరు సీనియర్లకు ఇది మింగుడు పడడం లేని అంశంగా పరిణమించింది. ఏపీ లో అత్యంత నాటకీయ పరిణామాల మద్య టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, మూడు ఎంపీ పదవులకే సైకిల్ పార్టీ పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలపై బీజేపీ కన్నేసింది. ఇదిలా ఉండగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు ఇతర పార్టీలకు వలసలను నివారించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీ అసెంబ్లీలో విపక్షంగా ఉన్న టీడీపీకి కీలకమైన పీఏసీ ఛైర్మెన్ పదవి దక్కనుంది.
పదవి పెట్టిన చిచ్చు..! ఎడమొహం పెడమొహంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు..!!
ఈ పదవికి పేర్లను ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబును కోరారు. పీఏసీ ఛైర్మెన్ పదవికి పయ్యావుల కేశవ్ పేరును చంద్రబాబు ప్రతిపాదించారు. ఈ మేరకు స్పీకర్కు కూడా ఆయన లేఖ పంపారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం పయ్యావుల కేశవ్ తో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్ పోటీ పడ్డారు. రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన అనగాని సత్యప్రసాద్కు ఈ పదవి దాదాపు ఖాయమన్నట్టుగా ప్రచారం సాగింది.
బాబుకు కొత్త తలనొప్పులు..! ఎప్పుడు ఎవరు పార్టీ మీద అలుగుతారో తెలియని పరిస్థితి..!!
కానీ, పయ్యావుల కేశవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. ఇటీవల తానా సభల్లో పాల్గొనేందుకు పయ్యావుల కేశవ్ అమెరికా వెళ్లారు. అక్కడ ఆయనతో బీజేపీ నేత రామ్ మాధవ్ సమావేశమయ్యారు. బీజేపీలోకి పయ్యావుల కేశవ్ చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో సాగింది. దీనిని కేశవ్ ఖండించారు. కేశవ్ కు అసెంబ్లీ వ్యవహరాలపై పట్టు ఉన్న కారణంగానే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారని పార్టీలో ఓ వర్గం వాదిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికే ఉన్న ఒక్క కేబినెట్ ర్యాంకు పోస్టును కేటాయించడంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అధికార వైసీపీ బీసీ, కాపు సామాజిక వర్గాలను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.
కాచుకు కూర్చున్న బీజేపి..! టీడిపి నేతలకు వలపన్ని కాపు చూస్తున్న కమలం నేతలు..!!
మరోవైపు, టీడీపీ నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ తరుణంలో, కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేశవ్ కే పీఏసీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. ఈ పదవిని ఆశించి భంగపడిన గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సత్యప్రసాద్... తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇదే మంచి అవకాశంగా వీరికి బీజేపీ గాలం విసురుతుందా..? మరి టీడిపి నేతలు కమలం నేతలకు చిక్కుతారా ? అన్న అంశం పై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో వాడి వేడి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.