నిన్ను నమ్మం బాబూ.. అంటున్నారు, చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అన్నారు: జగన్
ఇచ్చాపురం: ప్రజలను మోసం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీహెచ్డి చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగిసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. తనపై అభిమానంతో సభకు ఇంతమంది జనం వచ్చారని, నా అడుగులో అడుగు వేశారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో మీ గుండె చప్పుడును నేను విన్నానని చెప్పారు.
చంద్రబాబు పాలనను చూసి ప్రజలు.. నమ్మము బాబూ.. నమ్మము అంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏమైనా అంటే నదుల అనుసంధానం అంటారని, పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఇచ్చామని చెబుతారని అన్నారు. రెయిన్ గన్లతో కరువును పారద్రోలామని చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చెప్పారు. నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేస్తున్నారన్నారు. యువత నిరాశలో ఉన్నారని చెప్పారు.
ఎవరు ఆఫర్ ఇస్తే వారివైపు: మంత్రి గంటా ముందే గుట్టువిప్పిన అలీ, పార్టీలకు షాకింగ్ షరతులు?
14 నెలలు పాదయాత్ర చేస్తానని ఊహించలేదు
చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో 650 హామీలు పెట్టి మోసం చేశాడని జగన్ మండిపడ్డారు. ఈ సభకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారని చెప్పారు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. మీ గుండె చప్పుడునా నా గుండె చప్పుడుగా మార్చుకున్నానని చెప్పారు. ఈ పద్నాలుగు నెలల కాలంలో నడిచింది నేనైనా, నడిపించింది మీరేనని చెప్పారు. చంద్రబాబు వచ్చాక రాష్ట్రంలో ఓ వైపు కరువు, మరోవైపు విపత్తు అన్నారు. 14 నెలలు పాదయాత్ర చేస్తానని తాను ఊహించలేదని చెప్పారు.
ఇక చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అన్నారు
ఈ సందర్భంగా తన పాదయాత్రలో అనంతపురంలో కలిసిన ఓ రైతు గురించి ప్రస్తావించారు. తన పర్యటనలో శివన్న అనే రైతును కలిశానని, తన పొలంలో వేరుశనగ వేసినట్లు చెప్పాడని, పంట ఎలా ఉందని అడిగితే, చంద్రబాబు రాగానే కరువు వచ్చిందని చెప్పాడని, అనంతపురంలో చంద్రబాబు పర్యటనకు వచ్చినప్పుడు సాయం అడిగామని చెప్పాడని, అప్పుడు చంద్రబాబు అయ్యో కరువు వచ్చిందా అంటూ అధికారులను తిట్టాడని, ఆ డ్రామాలో మరో అడుగు ముందుకేసి రెయిన్ గన్ డ్రామా ఆడారని విమర్శించారు. రెయిన్ గన్ల పేరుతో చంద్రబాబు సినిమా చూపించారని చెప్పారు. ఇక చంద్రబాబుతో మనకు సావాసం వద్దబ్బా అని తన పాదయాత్రలో చెప్పారని జగన్ అన్నారు. నిన్ను నమ్మను బాబూ.. అని ప్రజలు చెబుతున్నారన్నారు.
చెన్నై వెళ్లి ఇడ్లీ సాంబర్ తింటారు
బెంగళూరులో కుమారస్వామితో చంద్రబాబు కాఫీ తాగుతారని, కానీ పక్కనే ఉన్న అనంతపురంలో కరువు వచ్చినా పట్టించుకోరన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెన్నై వెళ్లి స్టాలిన్ను కలుస్తారని, అక్కడ ఇడ్లీ, సాంబర్ తింటారని, కానీ ఆ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు గురించి ఆలోచించరని చెప్పారు. ప్రభుత్వ ఖర్చే కాబట్టి జాతీయ రాజకీయాలు అంటూ విమానాలు ఎక్కి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వద్దకు వెళ్తారని చెప్పారు. కోల్కతా వెళ్లి మమతతో చికెన్ తింటాడని ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటే ఈయన జాతీయ రాజకీయాలు చేస్తాడట అని మండిపడ్డారు.
విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు
చంద్రబాబు హయాంలో విద్యారంగం భ్రష్టుపట్టిందన్నారు. స్కూల్స్ మూసివేయించారన్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లలో సరైన మధ్యాహ్నం తిండి లేక పిల్లలు అల్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో దాదాపు 6వేల స్కూల్స్ మూసేశారన్నారు. నాసిరకం దుస్తులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, బీసీ హాస్టల్స్ను నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పటికీ పుస్తకాలు సరిగ్గా పంపిణీ చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లేవన్నారు. చంద్రబాబు వచ్చాడు కానీ.. ఉద్యోగాలు రాలేదని చెప్పారు. గోపాల మిత్ర ఉద్యోగాలు పోయాయని చెప్పారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎమ్మెల్యేలను కొని మంత్రులుగా చేశారు
వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకొని, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని జగన్ విమర్శించారు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తారన్నారు.