ఆత్మహత్యేనా?: తుపాకీ పేలి పాడేరు ఏఎస్పీ మృతి
విశాఖపట్నం: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశికుమార్(30) మృతి చెందారు. తుపాకీ గుండు ఆయన తలలోని కుడివైపు కణితిలో నుంచి దూసుకుపోవడంతో తన ఛాంబర్లోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది ఆయన గదికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్నారు. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. దీంతో ఆయన మృతదేహాన్ని పాడేరు ఆస్పత్రికి తరలించారు.
తమిళనాడుకు చెందిన శశికుమార్ మూడు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా పనిచేశారు. శశికుమార్ ఆత్మహత్యకు యత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు విశాఖ నుంచి పాడేరుకు బయలుదేరారు. ఐటీడీఏ ప్రాజెక్డు అధికారి హరినారాయణన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఆళ్లగడ్డలో పనిచేసినప్పుడు ఎర్రచందనం ముఠాలపై ఆయన కఠినంగా వ్యవహరించారని, పాడేరులోనూ మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి సత్ఫలితాలు సాధించారని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.