జైల్లోనూ నేనే శివుడిని అంటూ పద్మజ పిచ్చి కేకలు , చికిత్స కోసం దంపతులను స్విమ్స్ కు తరలింపు
మదనపల్లెలో మూఢభక్తి తో కూతుళ్లను అమానుషంగా హతమార్చిన జంట హత్యల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత విద్యావంతులైన ఇద్దరు భార్యాభర్తలు పురుషోత్తం నాయుడు, పద్మజలు మూడ భక్తితో ఇద్దరు కూతుళ్లను హతమార్చిన దారుణ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించింది.
జైల్లోనూ పిచ్చి కేకలు వేసిన పద్మజ
ఇక ఈ జంట హత్యల కేసులో తండ్రి పురుషోత్తం నాయుడును ఏ1 గా , తల్లి పద్మజ ను ఏ2 గా పోలీసులు కేసు నమోదు చేసి ,వారిని కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు ముందు కూడా తమ కూతుళ్లను చంపేశామని, కాని వారు తిరిగి బ్రతికి వస్తారని చెప్పుకొచ్చారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వారిని సబ్ జైలుకు తరలించారు. జైల్లో కూడా పద్మజ వింతగా ప్రవర్తించారు.
సబ్ జైలుకు తరలించిన పద్మజ జైలు గోడల మధ్య కూడా తానే శివుడిని అంటూ పెద్ద పెద్దగా కేకలు వేశారు.
అర్ధరాత్రి పూట తానే శివుడినని హాహాకారాలు .. భయపడ్డ మిగతా ఖైదీలు
నిన్న అర్ధరాత్రి పూట తానే శివుడిని అని హాహాకారాలు చేస్తూ పద్మజ కేకలు వేయడంతో జైల్లో ఉన్న మిగతా ఖైదీలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇక దీంతో జైలు అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పద్మజ తో పాటుగా పురుషోత్తం నాయుడు మానసిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేకపోవడంతో వారికి వైద్య చికిత్సలు చేయించాలని జైలు అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు మెజిస్ట్రేట్ కు సబ్ జైలర్ రామకృష్ణ నాయక్ లేఖ రాశారు.
దంపతులను తిరుపతిలోని స్విమ్స్ కు తరలించనున్న జైలు అధికారులు
వారి మానసిక స్థితి బాగా లేనందున జైలు నుండి ఆసుపత్రికి దంపతులను తరలించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. వీరిని ఆసుపత్రికి తరలించడం కోసం అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని మదనపల్లె డిఎస్పీ ని సబ్ జైలర్ కోరారు. పోలీసు బందోబస్తు నడుమ ఇద్దరు దంపతులను తిరుపతిలోని స్విమ్స్ కు తరలించనున్నారు జైలు అధికారులు. మరోవైపు పోలీసులు వీరి మానసిక పరిస్థితి బాగానే ఉందని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారని, కాకపోతే విపరీతమైన భక్తి ఉందని చెప్పడం గమనార్హం.
Recommended Video
వారు మానసిక వ్యాధి గ్రస్తులు ... చికిత్స అవసరం అన్న డాక్టర్ రాధిక
ఇక ఇప్పటికే పురుషోత్తమ నాయుడు భార్య పద్మజ మానసిక వ్యాధి గ్రస్తురాలని ఆమె తన సమస్యను భర్త కూతుళ్లకు కూడా అంటించిందని డాక్టర్ రాధిక తెలిపారు. పురుషోత్తం నాయుడు కూడా మానసిక సమస్య వచ్చిందని, చికిత్స తీసుకుంటే వారిరువురూ మానసిక వ్యాధి నుండి కోలుకుంటారని డాక్టర్ రాధిక చెప్తున్నారు. అంతేకాదు వారి కుటుంబంలోనూ మానసిక వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పిన డాక్టర్ రాధిక పద్మజ తండ్రి ఇటీవలే మానసిక వ్యాధితో మరణించాడని, పద్మజ మేనత్త కూడా మనో వ్యాధిగ్రస్తురాలేనని తెలిపారు. వారికి వైద్యం అవసరమని డాక్టర్ రాధిక స్పష్టం చేశారు.