విజయమని చెప్పం కానీ, బాధగా ఉంది: టిపై పల్లంరాజు
పదవుల్లో ఉన్నా ఇలాంటిది జరిగిందన్న బాధ తమలోనూ ఉందని, కాబట్టే దీనిని సరిదిద్దటానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు హాని జరిగినప్పుడు తాము పదవుల్లో ఉండబోమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా ఒప్పించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసి నిర్ణయంతో మూడు ప్రాంతాలకు న్యాయం జరగటం లేదని, మూడు ప్రాంతాలకూ న్యాయం చేయాలని సమైక్యంగా ఉంచితేనే పరిష్కారం ఉంటుందన్న విషయాన్ని అధిష్టానానికి చెబుతున్నామన్నారు.
ఈ విషయంలో విజయవంతమవుతామని భావిస్తున్నామన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు అంతా కలిసి గట్టిగా విజ్ఞప్తి చేయటం వల్ల ఆంటోనీ కమిటీ ఏర్పాటైందని, రాష్ట్ర విభజన అంశాన్ని ఈ కమిటీ సంపూర్ణంగా పరిశీలిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆంటోనీ కమిటీ సభ్యులు త్వరలోనే రాష్ట్రానికి వస్తారని భావిస్తున్నామన్నారు. వారు వస్తేనే రాష్ట్ర విభజనను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తోందీ తెలుస్తుందన్నారు. హైదరాబాద్ నగరం సెంటిమెంట్పై ఆధారపడిన విషయమని, ఈ నగరం మనదీ అనుకుని అంతా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని అమలు చేసేముందు మూడు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడాలని, వారికి హాని జరగకూడదని ఆంటోనీ కమిటీకి చెప్పామన్నారు.