వెంకయ్య ఏమయ్యారు?: ఎపికి ప్రత్యేక హోదాపై పల్లంరాజు ప్రశ్న
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాజకీయం చేసే అంశం కాదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు పల్లంరాజు అన్నారు. మంగళవారంనాడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ నిర్వహించిన బంద్లో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని పట్టుబట్టిన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏమయ్యారని ఆయన అడిగారు.
గత యుపిఎ ప్రభుత్వం విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఎప్పికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ హామీ ఇచ్చారని, అయితే ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకుడు వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో సీమాంధ్రలో పర్యటించిన మోడీ ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం బంద్ జరుగుతోంది.