కీలక నిర్ణయం: ముద్రగడ దీక్షపై అంతా రహస్యమే?, హేళనగా మాట్లాడతారా?
అమరావతి: హైదరాబాద్లోని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో కాపు నేతలు సమావేశమయ్యారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి, వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ పల్లంరాజు పేర్కొన్నారు.
ముద్రగడ దీక్ష, కాపుల రిజర్వేషన్లపై ఏపీ మంత్రులు అవహేళనగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. ముద్రగడ కుటుంబంపై జరిగిన దాడిని యావత్ జాతిపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ముద్రగడ దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.
మరోవైపు ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చెబితే గానీ ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. ముద్రగడ దీక్షను నీరుగార్చే క్రమంలో ప్రభుత్వం ఎలా ఎలా చెప్పమంటే వైద్యులు అలాగే చెబుతారన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి.
ముద్రగడను కలిసేందుకు కాపు నేతలతో పాటు ఆయన మద్దతుదారులను ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఆయన్ని ప్రభుత్వం ఒక ఉగ్రవాదిలా చూస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. తొలి రోజు మీడియాలో వచ్చిన చిత్రాలు, వీడియోలు తప్ప ఆయన ఇప్పటి వరకు ముద్రగడ ఎలా ఉన్నారో ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడింది.
రాజమహేంద్ర వరం ప్రభుత్వ ఆసుపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డీఎస్పీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నెల 9వ తేదీన ముద్రగడను రాజమహేంద్రవరం ఆసుపత్రికి పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆసుపత్రిలోనికి ఎవరినీ రానివ్వడం లేదు.
ప్రతి 400 మీటర్లకు ఒకటి చొప్పున బారికేడ్లు పెట్టారు. ప్రతిచోటా ఓ ఎస్సైని, 10 మంది సిబ్బందిని కాపలాగా నియమించారు. ఆ రోడ్డులోకి ఎవరూ రాకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. రోగులను తప్ప ఎవ్వరినీ అనుమతించడంలేదు. దీంతో ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కాపు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.