ఆ ఇద్దరికీ ప్రాధాన్యత: ఆ జిల్లాకే పదవులు, నేతల అసంతృప్తి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలిలో చీప్ విప్ల పదవులు అనంతపురం జిల్లాకే దక్కాయి. అయితే ఈ జిల్లాలో తొలి నుండి టిడిపికి మంచి పట్టుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది టిడిపి ప్రజా ప్రతినిధులు విజయం సాధించారు.అయితే ఈ జిల్లాకు చెందిన పల్లె రఘునాథ్రెడ్డికి శాసనసభలో చీప్ విప్ పదవి, శాసమండలిలో పయ్యావుల కేశవ్కు చీప్ విప్ పదవి దక్కింది. అయితే ఒకే జిల్లాకు రెండు చీప్ విప్ పదవులు దక్కడం పట్ల ఇతర జిల్లాల నేతలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తర్వాత చీప్ విప్ , విప్ పదవులను భర్తీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం ఈ మేరకు చీఫ్ విప్, విప్ల నియామకం చేస్తూ నిర్ణయాన్ని తీసుకొన్నారు.
జగన్కు షాక్: బాబును కలిసిన గురునాథ్రెడ్డి, ప్రభాకర్ చౌదరి ఏం చేస్తారు?
మంత్రివర్గం నుండి పల్లె రఘునాథ్ రెడ్డిని తప్పించి కాలువ శ్రీనివాసులుకు మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో పల్లె రఘునాథ్రెడ్డికి చీప్ విప్ పదవిని కట్టబెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని టిడిపి నేతలు అంటున్నారు.
అనంతపురం జిల్లాకే రెండు చీప్ విప్ పదవులు
ఏపీ అసెంబ్లీలో చీప్ విప్గా పల్లె రఘునాథ్ రెడ్డి, ఏపీ శాసనమండలిలో చీప్ విప్ గా పయ్యావుల కేశవ్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అనంతపురం జిల్లాకు టిడిపి మరోసారి ప్రాధాన్యత ఇచ్చింది. ఈ జిల్లాలో టిడిపికి మంచి పట్టుంది. ఈ కారణంగానే చంద్రబాబునాయుడు ఈ జిల్లాకు రెండు చీప్ విప్ పదవులను కట్టబెట్టారనే ప్రచారం కూడ సాగుతోంది. అదే సమయంలో ఒకే జిల్లాకు రెండు చీప్ విప్ పదవులను కట్టబెట్టడం పట్ల కూడ పార్టీ నేతల్లో లోలోన కొంత అసంతృప్తి నెలకొందనే ప్రచారం కూడ సాగుతోంది. అసెంబ్లీలో విప్గా యామిని బాల కూడ ఉన్నారు. ఆమె కూడ ఇదే జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అంతేకాదు ఈ జిల్లా నుండి పరిటాల సునీత మంత్రి పదవిని చేపట్టారు. మరోవైపు కాలువ శ్రీనివాసులు కూడ మంత్రి పదవిని చేపట్టారు. పార్టీ బలంగా ఉన్నందున ఎక్కువ పదవులు కేటాయించాల్నిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు కొందరు నేతలు. అయితే ఒకే జిల్లాకు ఎక్కువ పదవులు రావడం పట్ల ఇతర జిల్లాల నేతలు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు.
పయ్యావులకు దక్కిన చీప్ విప్ పదవి
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పయ్యావుల కేశవ్ టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో మంత్రి పదవి దక్కలేదు. అయితే కొన్ని సమయాల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏపీలో ప్రభుత్వం లేదు. అయితే ఈ దఫా ఏపీలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆయన మాత్రం ఉరవకొండ నుండి విజయం సాధించలేదు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. దీంతో పయ్యావులను ఎమ్మెల్సీగా టిడిపి నాయకత్వం నామినేట్ చేసింది. అంతేకాదు శాసనమండలిలో కేశవ్ను చీప్ విప్గా నియమిస్తూ నాలుగు రోజుల క్రితం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి పదవి దక్కకున్నా కేశవ్కు చీప్ పదవి మాత్రం దక్కింది.
విశాఖకు మరో రెండు విప్ పదవులు
విశాఖ జిల్లాకు మరో రెండు పదవులు ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నలుగురు విప్లున్నారు. అయితే మరో ఇద్దరిని నియమించాలని భావిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరావుకు ఈ పదవులను కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకే జిల్లాకు రెండు విప్ పదవులు కట్టబెట్టడంపై ఇతర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంటుందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఇప్పటికే అనంతపురం జిల్లా విషయంలో చీప్ విప్ ల నియామకంలో కూడ అసంతృప్తితో నేతలున్నారు.
నేతల ఆశలు ఆవిరేనా?
మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కుతోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు అసంతృప్తికి లోనయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కూడ మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అసంతృప్తులతో చర్చించారు. అయితే విప్, చీప్ విప్ ల నియామకంలో ఒకే జిల్లాకు రెండేసి పదవులను కట్టబెట్టడంపై కొంత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కూడ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే విప్లు నియామకం జరుగుతోందని ప్రచారం సాగుతున్న నేతల పేర్లకు సంబంధించి ఇంకా అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.