తండ్రి సమాధి వద్ద జగన్ రాజకీయం, సమాధి తప్పదు: పల్లె
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి, హోదా జగన్కు లేదని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద జగన్ రాజకీయాలు మాట్లాడుతున్నారని, జగన్కు రాజకీయ సమాధి తప్పదని పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.
జగన్ తహతహ
తెలంగాణ ఎసిబి నమోదు చేసి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైలుకు పంపాలని జగన్ తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ బాబు వల్లే కాలేదని, జగన్ వల్ల ఏమవుతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధిని ఓర్వలేకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. చంద్రబాబును విమర్శించే హక్కు జగన్కు, లక్ష్మీపార్వతికి లేదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు.