ఏపీ హామీలు: బాబు, వెంకయ్య, మోడీలపై కేసులకు టీడీపీ కౌంటర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులపై పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు నమోదు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి పల్లె రఘనాథరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించి, సీమాంధ్రులకు తీరని అన్యాయం చేసింది సోనియాగాంధీనే అని ఆయన మండిపడ్డారు. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలపై కేసులు పెట్టాలని అన్నారు. వీరితో పాటు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలని అన్నారు.
సీఎంపై కేసులు పెట్టడం సిగ్గుచేటు: యరపతినేని శ్రీనివాసరావు
ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసులు పెట్టడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదాపై తల్లి, పిల్ల కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్, వైసీపీకి ప్రజల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన కుట్రదారుడు ప్రతిపక్ష నేత వైయస్ జగనే అని పేర్కొన్నారు.
రూ. 1000కోట్లతో పెండింగ్లో ఉన్న మంచినీటి పథకాలను పూర్తి: మంత్రి అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలోని ఫ్లోరైడ్ గ్రామాల్లో రూ. 23 కోట్లతో 329 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 1000 కోట్లతో పెండింగ్లో ఉన్న మంచినీటి పథకాలను పూర్తి చేస్తామన్నారు.
పంచాయితీలు యాభై శాతం నిధులు సమకూరిస్తే 13, 14వ ఫైనాన్స్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఎల్ఈడీ లైట్ల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో డిప్యుటేషన్పై కార్యదర్శి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.