పొత్తులపై చర్చ, 28న లిస్ట్: డిగ్గీ, కోమటిరెడ్డిపై పాల్వాయి
కోమటిరెడ్డిపై పాల్వాయి ఫైర్
నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరుల పైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆదివారం నిప్పులు చెరిగారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమన్నారు. కోమటిరెడ్డి గతంలో అధినేత్రి సోనియా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలు, ఇతర పార్టీలతో జరిపిన సంప్రదింపులు హైకమాండ్కు తెలుసునని పాల్వాయి పేర్కొన్నారు.
కోమటిరెడ్డి సోదరులు వైయస్ హయాంలో కాంట్రాక్టుల పేరిట కోట్లు కూడబెట్టారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా పని చేశారన్నారు. ఇతర పార్టీలతో వారు సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు.
పాల్వాయి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవిపై తమ పార్టీ అధిష్టానం నుండి హామీ లభించనందునే కెసిఆర్ తన పార్టీని విలీనం చేయలేదన్నారు. కాంగ్రెసు ఒంటరిగా పోటీ చేస్తే 70 సీట్లు సాధిస్తుందన్నారు. తెరాస మాత్రం నలభై సీట్లకు మించి గెలవదన్నారు. హరీశ్ రావు లేవనెత్తిన పది అంశాలపై చర్చకు తాను సిద్దమన్నారు.
ఓట్ల కోసం రాజకీయాలొద్దు: రాజయ్య
ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేయవద్దని, అమరుల ఆత్మలు క్షోభిస్తాయని ఎంపి రాజయ్య అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు.
జైపాల్ పోటీ చేయకుంటే..
కాంగ్రెసు పార్టీ స్క్రీనింగ్ కమిటీతో సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబులు భేటీ అయ్యారు. చేవెళ్ల లోకసభ నియోజకవర్గం నుండి జైపాల్ రెడ్డి పోటీ చేయకుంటే ఆ టిక్కెట్ తన తనయుడికి ఇవ్వాలని సబిత స్క్రీనింగ్ కమిటీని కోరినట్లుగా తెలుస్తోంది.