కిరణ్ నాశనం చేస్తున్నారు: పాల్వాయి, బాబుపై కడియం
హైదరాబాద్/వరంగల్/ఖమ్మం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని నాశనం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. కిరణ్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఒక విధానం లేదని, ఆయనది రెండు నాల్కల ధోరణి అని ఎద్దేవా చేశారు.
హైదరాబాదు పైన కేంద్రం పెదత్తనం వద్దన్న మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తన్నానని చెప్పారు. అయితే రాయల తెలంగాణకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు. దానిని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హర్యానాలా తెలంగాణను అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలంగాణకు రెండు భారీ ప్రాజెక్టులు కావాలని, గోదావరి పైన జాతీయ ప్రాజెక్టు కట్టాలన్నారు.
అధిష్టానాన్ని ఏమీ అనవద్దని చెప్పిన మంత్రి కొండ్రు మురళిని ముఖ్యమంత్రి మందలించడం అవివేకమని మరో సీనియర్ నేత ఆమోస్ అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బతకాలంటే ముఖ్యమంత్రి పదవిని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న వారు తప్పుకోవాలని సూచించారు.
భద్రాచలం ఆత్మ వంటిది: కోదండ
తెలంగాణకు హైదరాబాదు గుండెకాయ వంటిది అయితే భద్రాచలం పుణ్యక్షేత్రం ఉన్న ప్రాంతం ఆత్మవంటిదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఖమ్మం జిల్లాలో అన్నారు.
రాష్ట్రం కాదు టిడిపి అనిశ్చితిలో: కడియం
తెలుగుదేశం పార్టీ పూర్తి అనిశ్చితిలో ఉందని మాజీ మంత్రి, తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు రాష్ట్రంలో ఎలాంటి అనిశ్చితి లేదన్నారు. టిడిపిలోనే ఉందన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం చేతిలో ఉందని విమర్శించారు.