అసమ్మతితో కెసిఆర్ ప్రభుత్వం కూలుతుంది: పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం రెండేళ్లకు మించి కొనసాగదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
అసమ్మతి వల్ల కెసిఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్ఎస్ సర్కారు పడిపోతే కాంగ్రెస్ ధీటుగా ఎదిగేలా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పాల్వాయి అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సొంతపార్టీపైనా విమర్శలు గుప్పించారు. కమర్షియల్ లీడర్షిప్ కాదు.. ఎఫెక్టివ్ లీడర్షిప్ కావాలని అన్నారు. సిఎల్పీ నేతగా జానారెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. సిఎల్పీ బాధ్యతలను జీవన్ రెడ్డికి అప్పగించాలని అన్నారు.
24న టి కేబినెట్ సమావేశం
అక్టోబర్ 24వ తేదీన సాయంత్రం 6గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు, పలు అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. నవంబర్ 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
కరెంట్ కష్టాలపై కెటిఆర్ను పారిశ్రామిక వేత్తలు
వారానికి రెండు రోజులపాటు కరెంటు కట్ చేయడంపై అసంతృప్తిగా వున్న పలువురు పారిశ్రామికవేత్తలు, తెలంగాణ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు మంగళవారం తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావును కలిశారు. విద్యుత్ కోతలను వారానికి రెండు రోజులు కాకుండా ఒక రోజుకు కుదించాలని ఈ సందర్భంగా కెటిఆర్కు వారు విజ్ఞప్తి చేశారు.