తపస్సు చేసినా టి ఆగదు: సిఎంపై పాల్వాయి, టి నేతలు
రాష్ట్ర విభజనపై శాసనసభలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడారో ఎవరికైనా అర్థమైందా అని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడిగారా అని అన్నారు. ఇలాంటి నాయకుడు ఉన్నా.. లేకున్నా ఒక్కటేనని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.
సిఎంది ఏకపక్ష నిర్ణయమే: పొన్నాల
తెలంగాణ బిల్లును తిప్పిపంపాలంటూ శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం చేయడంపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా మండిపడ్డారు. సిఎం కిరణ్ది ఏకపక్ష నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రులను సంప్రదించకుండా ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి జైరాం రమేష్ను ప్రశ్నించే ముందు ఏ రకంగా నోటీసులు ఇచ్చారో సీఎం చెప్పాలన్నారు. ఇచ్చిన సమయంలో ఏం చేశారని ముఖ్యమంత్రి కిరణ్, ఇంకా గడువు కోరతారని పొన్నాల ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క వ్యక్తికి కూడా రాజ్యసభకు అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు వ్యక్తిగత లబ్ధి చేకూర్చితే తప్ప అవకాశం రాదని విమర్శించారు.
టిని అడ్డుకోలేరు, 7న ఢిల్లీలో వర్క్షాప్: కోదండరాం
తెలంగాణను ఎవరు అడ్డుకోలేరని తెలంగాణ జెఏసి ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఢిల్లీలో ఫిబ్రవరి 7న వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణకు మద్దతు పలికే పార్టీల నేతలను కలుస్తామని చెప్పారు. తెలంగాణ అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న కుట్రలను తెలంగాణవాదులందరూ తిప్పికొట్టాలని అన్నారు.
లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు అసెంబ్లీ నిబంధనలు తెలియదా అని కోదండరాం ప్రశ్నించారు. సమైక్యవాదుల కుట్రలో జెపి భాగస్వామి అవుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు కోదండరాం తెలిపారు.