ఉంటే ఎంత.. పోతే ఎంత: కిరణ్పై పాల్వాయి నిప్పులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి అని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ముఖ్యమంత్రి శిశుపాలుడి కంటే ఎక్కువ తప్పులు చేశారని విమర్శించారు.
కిరణ్ రెడ్డిని పదవి నుండి, పార్టీ నుండి డిస్మిస్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూనే తమ ప్రాంతానికి మరింత అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అబద్దాలకోరులు అని ధ్వజమెత్తారు. ఢిల్లీలో క్యాంపులు పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
మంత్రుల అనుమతి లేకుండా ముఖ్యమంత్రి మంత్రుల బృందానికి (జివోఎం)కు నివేదిక ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. కొత్త రాజధాని కట్టుకనే వరకు వరండా ఇస్తామని చెబితే ఇళ్లంతా మాదే అన్నట్లుగా సీమాంధ్ర నేతల వ్యవహార శైలి ఉందన్నారు.
సీమాంధ్రకు న్యాయం: డిఎస్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తారని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ వేరుగా అన్నారు. జనవరి 1 లోపు తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి మార్పును తాము కోరుకోవడం లేదని మంత్రి జానా రెడ్డి చెప్పారు.