పాల్వాయి సంచలనం, నరకమని వీరు: కెసిఆర్పై రమణ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం తెలియని వాళ్లు గాంధీ భవన్లో ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. కాంగ్రెస్ పార్టీ ఓటమిని, తెరాసలోకి ఎమ్మెల్సీల చేరికను ఉద్దేశించి అన్నారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపులో డబ్బులు చేతులు మారటం వల్లనే ఓడిపోయామన్నారు. పార్టీ క్యాడర్లో విశ్వాసం కలిగించే పీసీసీ, సీఎల్పీ నేతలు ఉండాలన్నారు. పోలవరం డిజైన్ కేంద్రమే సూచించాలన్నారు.
నరకంగా మార్చారు: తెరాస ఎమ్మెల్సీలు
కాంగ్రెస్ పార్టీ పై ఆ పార్టీ నుంచి తాజాగా తెరాసలో చేరిన ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్లు గాంధీ భవన్ను నరకంగా మార్చేశారని భూపాల్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో దోపిడీ దారులు, పైరవీకారులు ఎక్కువయ్యారని, ఇంకా పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదని పార్టీ మారానని రాజలింగం తెలిపారు.
పదవులు ఆశించి తెరాసలోకి రాలేదని భూపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ సాధనకు కెసిఆర్కు సహాయసహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో తెరాసలోకి వచ్చామన్నారు.
కెసిఆర్పై రమణ
అధికారంలోకి వచ్చినా ఇంకా ప్రజలనురెచ్చగొట్టే ధోరణిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని తెలంగాణ టీడీపీ నేత ఎల్ రమణ విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్న వారిని సన్నాసులని విమర్శించి తన పార్టీలో చేర్చుకోగానే సన్మార్గులవుతారా అని ప్రశ్నించారు. కెసిఆర్ ఉడత బెదిరింపులకు తాము బెదిరేది లేదని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తిప్పి కొడతామన్నారు.