ఏపీ పామర్రు పేరు సార్థకం చేసుకుంటోంది..! ఎక్కడ చూసినా విష సర్పాలే.. 200 మందికి కాట్లు..!
మచిలీపట్నం: ఒక పామా, రెండు పాములా.. పదుల సంఖ్యలో పాములు కనిపిస్తోంటే జనం వెన్నులో వణుకు పుడుతోంది. సాధారణంగా పాములు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వాటి బెడద మరింత తీవ్రమైంది. రాత్రి, పగలు అనే తేడా లేదు. కంటి మీద కూనుకూ ఉండట్లేదు. గడప దాటాలంటే భయం..పొలం పనులకు వెళ్లాలంటే భయం. ఏ వారమో, పదిరోజులో కాదు..నెలరోజులుగా జనం పడుతోన్న బాధలు ఇవి. కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో తలెత్తిన పరిస్థితులు.. క్రమంగా మరింత జటిలంగా తయారవుతున్నాయి ఈ పాముల బెడద వల్ల. తాజాగా- మరిన్ని పాముకాటు కేసులో నమోదయ్యాయి. వర్షాల వల్ల పాముల తాకిడి మరింత అధికమైందని వాపోతున్నారు ఈ నియోజకవర్గం పరిధిలోని గ్రామస్తులు.
జెరూసలేం టూర్ ఎఫెక్ట్: వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. తీర ప్రాంతాల్లో ఉప్పునీటి శుద్ధి కేంద్రాలు?
పాము మెడ ఆకారంలో..
పామర్రు పూర్తి పేరు పాము అర్రు.. అర్రు అంటే మెడ అని అర్థం అట. పాము మెడ నమూనాలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు పెద్దలు. క్రమేణా ఈ పాము అర్రు కాస్త పామర్రు అయి కూర్చుంది. తన పేరును సార్థకం చేసుకుంటోంది. పామర్రు మీద పాములు పగబట్టాయా? అనేలా కనిపిస్తోంది అక్కడి పరిస్థితి. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలోని మొవ్వ మండలంలో యద్ధనపూడిలో కొన్ని పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఒక్క మొవ్వ మండలం మాత్రమే కాదు.. ఈ నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాల్లో పాము కాటు ఘటనలు ప్రతీ రోజు సంభవిస్తున్నాయి. కిందటి నెలలో మొత్తం 70 పాము కాటు కేసులు నమోదయ్యాయి. నెల దాటే సరికి వాటి సంఖ్య మరింత పెరిగింది.
పామర్రు ఒక్కటేనా..
పామర్రు, పమిడిముక్కల, తొట్లవల్లూరు, మొవ్వ, పెదపారుపూడి మండలాల్లో ఈ నెలలో ఇప్పటికే 110కి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయి. దివిసీమ ప్రాంతంలోనూ తరుచుగా పాము కాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలకు తోడు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో ఎక్కడెక్కడి నుంచో పాముటు కొట్టుకొస్తున్నాయి. పాము కాటు బాధితులతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి కిటకిటలాడుతోంది. నాగాయలంక, మొవ్వ, అవనిగడ్డ వంటి ప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఘంటసాల, కోడూరు మండలాల్లో పాముల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
పుట్టల్లో నీరు చేరడంతో..
వానాకాలంలో పాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. కప్పలు, ఎలుకల కోసం వేట కొనసాగిస్తుంటాయి. కృష్ణానది పరవళ్లు తొక్కుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న పాములకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి మరిన్ని పాములు పెద్ద సంఖ్యలో కొట్టుకొస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీనికితోడు- వర్షాల వల్ల పుట్టలు కరిగిపోవడం వల్ల అవి క్రమంగా జనావాసాల్లోకి ప్రవేశిస్తుంటాయని చెబుతున్నారు. వర్షాకాలంలో పుట్టల్లోకి నీరు చేరడంతో అవి జనావాసాల్లోకి, పొలం గట్లపైన చేరి ఎలుకల వేట సాగిస్తుంటాయి. గట్ల కలుగుల్లో ఉన్న పాములను గుర్తించట్లేదు రైతులు, వ్యవసాయ కూలీలు. పొలం పనుల్లో నిమగ్నమైన సమయంలో పాముకాటుకు గురవుతున్నారు. తాచుపాము, కట్లపాము, రక్తపింజరి కాటుకు గురైనప్పుడు విషతీవ్రత అధికంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.