సమైక్యంగా ఉంటుందేమో: పురంధేశ్వరిపై పనబాక
గుంటూరు, వరంగల్: కాంగ్రెసును వీడి బిజెపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై కేందర్ మంత్రి పనబాక లక్ష్మి పరోక్ష వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ఆమె సోమవారం గుంటూరు జిల్లాలోని బాపట్లలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పురంధేశ్వరి బిజెపిలోకి వెళ్లితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందేమోనని ఆమె వ్యాఖ్యానించారు.
స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు కాంగ్రెసులో కొనసాగలేక పార్టీని ఛిన్నాభిన్నం చేశారని ఆమె విమర్శించారు పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి కార్యాచరణను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు తగిన న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరినట్లు ఆమె తెలిపారు
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులందరూ ట్యాక్స్ ఫ్రీ, పోలవరానికి జాతీయ హోదా వంటి డిమాండ్లు పెట్టినట్లు ఆమె తెలిపారు. మొదటి నుంచి పేద, బడుగు వర్గాల గురించే పార్టీలో ఆలోచిస్తోందని పనబాక చెప్పారు. దళితులకు ఏ పార్టీ చేయని విధంగా సబ్ ప్లాన్ అమలు చేసి తమ పార్టీ న్యాయం చేసిందని ఆమె అన్నారు.
విభజన జరిగిన తర్వాత కూడా కొందర జై సమైక్యాంధ్ర అనడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.