ఎంపీల తీరు హేయం, విభజనకు సహకరిస్తా: పనబాక
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ లోక్సభలో వ్యవహరించిన తీరు వల్ల సీనియర్ ఎంపీలు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు హేయమైన చర్య అని పనబాక అన్నారు.
సీమాంధ్ర ఎంపీలపై ఇతర రాష్ట్రాల ఎంపీలు దాడికి పాల్పడ్డారని చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని పనబాక చెప్పారు. సభలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ ప్రవర్తించిన తీరు బాధకరమని అన్నారు. వారి ప్రవర్తన వల్ల సభలో భయానక వాతావరణం నెలకొందని చెప్పారు. సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజనపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కేవలం రాజకీయ నాయకుల్లో మాత్రమే ఉందని ఆమె తెలిపారు.
వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని చెప్పిన పనబాక, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం విభజనకు సహకరిస్తానని స్పష్టం చేశారు. లోక్సభలో షిండే విభజన బిల్లును చదవడం తాను విన్నానని పనబాక లక్ష్మీ తెలిపారు. విభజన జరిగినా, జరగకపోయినా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని వెల్లడించారు. విభజన తర్వాత కూడా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఉంటుందని పనబాక చెప్పారు.
పార్లమెంటు ఫ్యాక్షనిజమే పెద్దది: కోట్ల
రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు దక్కవని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు విభజనతో లబ్ధి పొందుతాయని అన్నారు. రాయలసీమ కంటే పార్లమెంటు ఫ్యాక్షనిజమే పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనపై చర్చలకు ఇంకా దారులు మూసుకుపోలేదని మరో సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. సామరస్యంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని కోరుతున్నామని జేడీశీలం పేర్కొన్నారు.