వెళ్లండి, మేమున్నాం: లగడపాటికి పనబాక, కిల్లి కౌంటర్
పార్టీని వీడి వెళ్లిపోయేవారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని సొంత ప్రయోజనాల కోసం వెళ్లిపోయే వారిని పట్టించుకోనక్కర్లేదని కృపారాణి అన్నారు. పార్టీని అనవసరంగా విమర్శిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని మహామహులు వేసిన పునదులు బలంగా ఉన్నాయని వాటిని కదిపే సత్తా ఏవరికీ లేదని శ్రీకాకుళంలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో చెప్పారు. అనసవరంగా పార్టీని విమర్శిస్తే ఖబడ్దార్ అంటూ రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి హెచ్చరించారు.
మరోవైపు పనబాక లక్ష్మి గుంటూరు జిల్లా బాపట్లలో మాట్లాడుతూ పార్టీని వీడి వెళ్లదలచుకున్న వారు వెళ్లిపోతే తాము పార్టీని బలోపేతం చేసుకుంటామని అన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారని నాయకులే పిల్లివాటం చూపుతున్నారన్నారు. ఇక, 2014 అసెంబ్లీ ఎన్నికలలో తాను కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేస్తానని మంత్రి తోట నరసింహం స్పష్టం చేశారు.
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిరాధారమని కాకినాడలో చెప్పారు. కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని, సమైక్యాంధ్రలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తామన్నారు. 2014 ఎన్నికల్లో తోట వాణి ఎక్కడ నుంచీ పోటీ చేయరని, ఇంట్లో వంట చేస్తారని తోట చమత్కరించారు.