తప్పదు, విభజనకు మానసికంగా సిద్ధపడాలి: పనబాక
గుంటూరు/ ఏలూరు/ హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు రానున్న లోకసభ ఎన్నికల్లో తాను బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీ మహాసముద్రంలాంటిదని ఆమె ఆదివారం బాపట్లలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. డబ్బు, అధికారం కోసం ఎంత మంది కాంగ్రెసు పార్టీని వీడినా నష్టం ఏమీ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల తమ కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం ఉండదని ఆమె అన్నారు. కాంగ్రెసు కేవలం సీమాంధ్ర పార్టీ కాదని, అది జాతీయ పార్టీ అని ఆమె అన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన తథ్యమని, విభజనకు మానసికంగా సిద్ధపడాలని ఆమె అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్లలాంటివని ఆమె అన్నారు. సీమాంధ్రను సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని, అందుకు ప్రణాళికను కేంద్రం ముందుంచామని పనబాక లక్ష్మి చెప్పారు.
కాగా, గుంటూరు జిల్లా కాకనూరులో సమైక్యవాదులు కేంద్ర మంత్రి జెడి శీలంను అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయలేదంటూ నిలదీశారు. విభజన అనివార్యమైతే సీమాంధ్రులకు న్యాయం జరిగేలా చూస్తానని శీలం సమైక్యవాదులకు హామీ ఇచ్చారు.
సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నాం
ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర మంత్రులమంతా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాసనసబలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు. కొందరు కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రక్రియ పూర్తయిందని చెప్పడం బాధాకరమని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అన్నారు.
అప్రజాస్వామికంగా కేంద్రం..
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెసు సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం కన్వీనర్, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన కనీస విధానాలను కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్లాల్సిన తొందరేమిటని ఆయన అడిగారు. సీమాంధ్ర ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన ఐదు కోట్ల మంది ప్రజలను పట్టించుకోకుండా ముందుకెళ్లడం సరి కాదని ఆయన అన్నారు. ఇలాంటి పరిణామాలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.