పార్టీ వీడాలనుకుంటే ఇప్పుడే వెళ్లిపోండి!: టిపై పనబాక
గుంటూరు: విభజన అనివార్యమని, పార్టీని వీడాలనుకునే వాళ్లు తక్షణమే వెళ్లిపోవాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఆదివారం ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. విభజన అనివార్యంగా ఉన్నందున రాజధాని హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా ఉంచాలని తాను ప్రతిపాదించినట్లు చెప్పారు.
రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రం ఇండోనేషియా తరహాలో అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. తడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఎనిమిది లైన్ల రహదారిని నిర్మిస్తే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
కృష్ణా, గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి రాజీనామాలు ఉపయోగపడవన్నారు. హైదరాబాద్ విషయంలో గడువు నిర్ణయించకుండా సీమాంధ్ర అభివృద్ధి చెందే వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతామన్నారు.
హైదరాబాద్లోని సీమాంధ్ర ప్రజలకు రక్షణ కలగాలంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్ను వీడి వెళ్లాలనుకునేవారు తక్షణమే వెళ్లిపోవాలని, పార్టీని ప్రక్షాళన చేసి తిరిగి అభివృద్ధి చేసుకుంటామన్నారు. కమిట్మెంట్తో ఉన్న వ్యక్తులు ఎక్కడికీ పోరని, స్వార్థంతో కూడిన వ్యక్తులు మాత్రమే పార్టీ నుంచి వెళ్లిపోతారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, రానున్న లోకసభ ఎన్నికల్లో తాను బాపట్ల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీ మహాసముద్రంలాంటిదని, డబ్బు, అధికారం కోసం ఎంత మంది కాంగ్రెసు పార్టీని వీడినా నష్టం ఏమీ ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం వల్ల తమ కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన నష్టం ఉండదని ఆమె అన్నారు.
కాంగ్రెసు కేవలం సీమాంధ్ర పార్టీ కాదని, అది జాతీయ పార్టీ అని ఆమె అన్నారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన తథ్యమని, విభజనకు మానసికంగా సిద్ధపడాలని ఆమె అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రెండు కళ్లలాంటివని ఆమె అన్నారు.