సమైక్యవాదులైతే: పనబాక, జగన్కు అశోక్బాబు వార్న్
గుంటూరు/చిత్తూరు/హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు నిజమైన సమైక్యవాదులే అయితే శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు సహకరించాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి బుధవారం అన్నారు. గుంటూరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి సభ జరగకుండా చేయడం ఏమాత్రం సరికాదన్నారు.
సమైక్యం పైన ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే చర్చ జరగనివ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చిన నేపథ్యంలో సమైక్యాంధ్రపై తీర్మానం అవసరం లేదన్నారు. బాపట్లలో కులం పేరుతో బహిరంగ దూషణలకు దిగుతున్న గెజిటెడ్ అధికారిపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే: వివేక్
సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాజకీయ లబ్ధి కోసమే చర్చను అడ్డుకుంటున్నారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు వివేక్ అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. సభలో చర్చకు సభ్యుల సహకరించాలని కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక విలీన అంశంపై మాట్లాడుతానని కెసిఆర్ చెప్పారన్నారు. విలీనానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేదన్నారు.
సస్పెండ్ చేయాలి: ఈటెల
చర్చను అడ్డుకునే వారిని సభ నుండి సస్పెండ్ చేయాలని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. బిల్లు వచ్చి నెల అవుతున్నా చర్చ జరగడం లేదన్నారు. ఓటింగ్ చేపట్టే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు.
ముఖ్యమంత్రి పార్టీ పెడితే: శంకర రావు
ముఖ్యమంత్రి పార్టీ పెడితే అది పాతాళానికి, అందులో చేరిన వారు కైలాసానికి వెళ్తారని మాజీ మంత్రి శంకర రావు ఎద్దేవా చేశారు. కిరణ్కు అధిష్టానాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
చర్చకు సహకరించకుంటే: అశోక్ బాబు
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చర్చకు సహకరించాలని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు డిమాండ్ చేశారు. చర్చకు సహకరించకుంటే విభజనకు మద్దతిచ్చినట్లే అవుతుందన్నారు. చర్చలో పాల్గొనని ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు హెచ్చరించారు. కాగా, చర్చకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నో చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో అశోక్ బాబు ఆ పార్టీని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు.
తమ త్యాగాలు వృథా కానివ్వమని, అవసరమైతే మరోసారి ఉద్యమిస్తామన్నారు. అన్ని పార్టీలు ఐక్యంగా చర్చకు సహకరించాలన్నారు. సభ సజావుగా సాగాలన్నారు. లేని పక్షంలో సంక్రాంతి తర్వాత ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. గడువులోగా తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు.