పిల్లకాకి: పవన్పై పనబాక, చిరు టీంకు ఫ్యాన్స్ హెచ్చరిక
విశాఖ/హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైన కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, మాజీ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు శుక్రవారం స్పందించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఎపి ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పనబాక, ఆనంలు విశాఖలో మాట్లాడారు.
కొత్త కూటమితో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆమె జనసేన, టిడిపి, బిజెపి పొత్తులను ఉద్దేశించి అన్నారు. పిల్లకాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని పవన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఆఖరి నిమిషం వరకు మభ్య పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. రోడ్డు మ్యాప్ వచ్చాక కూడా కిరణ్ తమను పిలిచి మాట్లాడలేదని ఆమె ఆరోపించారు.
కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే పార్టీ అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జనసేన వల్ల కాంగ్రెసు పార్టీ నష్టపోతుందనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి నాయకులు పోతున్నారు తప్పితే కార్యకర్తలు ఎవరు వెళ్లడం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఎక్కువ.. జిల్లాకు తక్కువ అని, ఆయన ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.
చిరుకు అభిమానుల ఝలక్
బస్సుయాత్ర సందర్భంగా చిరంజీవికి మెగా అభిమానులు ఎక్కువ మంది షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు ఎక్కువ మంది పవన్ జనసేన వైపు మొగ్గు చూపుతున్నరు. ఇప్పుడు చిరు నేతృత్వంలోని బస్సుయాత్రకు కూడా దూరంగా ఉండాలని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బస్సుయాత్ర పేరుతో పవన్ను టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని చిరంజీవి నేతృత్వంలోని సీమాంధ్ర కాంగ్రెసు నేతలను హెచ్చరిస్తున్నారు.