పంచకర్ల రమేష్ బాబు: చంద్రబాబే రెచ్చగొట్టారు, టీడీపీని చాలా మంది వీడతారు, లోకేష్ నాయకుడు కాలేడు
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. శుక్రవారం పంచకర్ల రమేష్ బాబు తన అనుచరులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
చంద్రబాబే రెచ్చగొడుతున్నారు.. అందుకే టీడీపీని వీడా..
ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. ఐదు నెలల క్రితమే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన మనుషులే అభివృద్ధి చెందాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారని పంచకర్ల తెలిపారు.తమ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండలేకనే టీడీపీని వీడినట్లు రమేష్ బాబు చెప్పారు.
చాలా మంది టీడీపీ వీడతారు.. లోకేష్ నాయకుడికి పనికిరాడు
అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇంకా చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. లోకేష్ నాయకుడిగా పనికిరాడని టీడీపీ నేతలంతా చెప్పినా.. దొడ్డిదారిన అతడ్ని మంత్రిని చేసి పెత్తనం చెలాయించేలా చేశారని పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంతో ఉత్తరాంధ్రకు మంచిరోజులు వచ్చాయని అన్నారు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేకి..
చంద్రబాబు ప్రజా వ్యతిరేకి అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే జరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముందని.. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందని అన్నారు. రఘురామరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు విజయసాయి తెలిపారు. రఘురామరాజుపై చర్యలు తీసుకుంటారనే విశ్వాసముందన్నారు.
Recommended Video
చంద్రబాబుకు అవంతి సవాల్..
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రేనని అన్నారు. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని.. అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోతుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటికి రావాలన్నారు.