ఏపీలో కరోనా విజృంభణపై పంచాంగకర్త సంచలన విషయాలు.. ఏం జరగబోతోంది..?
ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉగాది పర్వదినం రోజున పంచాగకర్తలు కొత్త పంచాంగం చదివి వినిపించారు. ఇది శార్వరీ నామ సంవత్సరం అని.. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారని పంచాంగ కర్త కప్పగుంట్ల సుబ్బరామ సోమయాజీ సిద్దాంతి తెలిపారు. ఈ ఏడాది శని మకరం,కుంభంలో సంచారం చేసే సమయంలో కష్టజీవులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రభుత్వానికి కూడా సానుకూల ఫలితాలు లభిస్తాయన్నారు. గురు సంచారం బాగుంటేనే రైతులు బాగుంటారని.. ఈ ఏడాది గురు సంచారం అనుకూలంగా ఉండటంతో.. పాడిపరిశ్రమ పురోగతి చెందుతుందని తెలిపారు. అక్టోబర్ ప్రాంతంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ముందస్తు జాగ్రత్తలతో దాన్ని ఎదుర్కొనవచ్చునని తెలిపారు.
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిపై పంచాంగకర్త సంచలన విషయాలు..
ఇక కరోనా వైరస్ విషయాన్ని కూడా పంచాగకర్త ప్రస్తావించారు. గతేడాది పంచాంగంలో కరోనా వైరస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు. అయితే అది సరికాదన్నారు. వైద్యులు మాత్రం కరోనా వస్తుందని కనిపెట్టారా.. అలాగే జ్యోతిష్కులు.. అని చెప్పుకొచ్చారు. నిజానికి గతేడాది పంచాంగంలో పంచాంగకర్తలు పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రాలకు,రాష్ట్రాలే కొట్టుకుపోయే వినాశనం వస్తుందని పరోక్షంగా చెప్పారని తెలిపారు. వ్యవస్థలో,జీవన శైలిలో వస్తున్న మార్పులు ఒకేలా ఉండటం లేదని.. కాబట్టి ప్రళయాలు ఏ రూపంలోనైనా వచ్చే అవకాశం ఉందని అన్నారు.
మే 30 తర్వాత ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభించే అవకాశం ఉందని.. అప్పటివరకు సాధారణంగానే ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 23 వరకు కరోనా విజృంభిస్తుందని.. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడుతాయని తెలిపారు.
సెప్టెంబర్ 23 తర్వాత..
పంచాంగ పఠనానికి వస్తూ వెంట మాస్కులు,శానిటైజర్స్ తెచ్చుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని.. ప్రజలంతా ప్రభుత్వ సలహాలు,సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అమ్మవారిని,సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలని తెలిపారు. వీలైతే అన్ని ఆలయాల్లో ప్రభుత్వం ధన్వంతరి హోమాలు,యాగాలు చేయించాలని.. తద్వారా వైరస్ను ఎదుర్కొని ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 23 తర్వాత రాష్ట్రానికి చాలా అనుకూల ఫలితాలు వస్తాయన్నారు. అందరికీ జీవనోపాధి దొరుకుతుందని.. దిగువ మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. ప్రభుత్వం సక్సెస్ రేటుతో దూసుకెళ్తుందని తెలియజేశారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Recommended Video
ఏపీలో 8 కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం(మార్చి 24) నాటికి 8కి చేరింది. చిత్తూరు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా సోకినట్లు స్విమ్స్ వైద్యులు నిర్ధారించారు. ఆ యువకుడు ఇటీవలే ఇంగ్లండ్ నుంచి వచ్చినట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిత్యావసరాలు,కూరగాయల కొనుగోలు కోసం ఉదయం 6గంటల నుంచి ఉదయం 9గంటల వరకు మూడు గంటల పాటు సడలింపునిచ్చారు.