ఏపీ ఉద్యోగులకు మంచి గుర్తింపు ఉంది: పంచాయతీ ఎన్నికల జరపాల్సిందేనంటూ నిమ్మగడ్డ లేఖ
అమరావతి: పంచాయతీ ఎన్నికలకు సహకరించేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ బహిరంగ లేఖ రాశారు. అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 2 పేజీల ప్రకటనను విడుదల చేశారు.
ఉద్యోగులకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ భరోసా
పోలింగ్ సిబ్బంది భద్రతకు పూర్తి చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు. కరోనా బారినపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్షీల్డ్లు సరఫరా చేస్తామన్నారు. సీఎస్తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశామని తెలిపారు.
ఏపీ ఉద్యోగులు అదే సంకల్పంతో పనిచేయాలి..
అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయని ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ గుర్తు చేశారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎంతో కష్టపడి పనిచేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు ఉందని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు
రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, దీనికి అందరూ కలిసి రావాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కోరారు. ఎన్నికల విషయంలో పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నాయని, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పార్టీలు కోరుతున్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు.ఇదిలావుండగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా వున్న సచివాలయాల వారి లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవా లేదా అనే విషయంపై సీస్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఎన్నికలు జరిగితేనే పంచాయతీలకు నిధులు..
ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా సామాజిక నాయకత్వం ఏర్పడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు. ఓవైపు ఉద్యోగ సంఘం నేతలు, మరోవైపు అధికార పార్టీ నేతలు ఎన్నికల నిర్వహించొద్దని కోరుతుంటే.. కమిషనర్ మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.