ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోండటం, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న ఉద్యోగ సంఘాల నేతలు.. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం తెలుపుతున్నట్లు చెబుతున్నారు.
Recommended Video
కొత్త ఎస్ఈసీ కోసం అన్వేషణ: నిమ్మగడ్డ స్థానంలో నీలం సాహ్నీకి ఛాన్స్?: రేసులో జస్టిస్ కనగరాజ్
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ఇది వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణపై ఇదివరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఎన్నికలను నిర్వహించడానికే మొగ్గు చూపింది.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. వచ్చేనెల 5వ తేదీ నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. డివిజన్ బెంచ్ తాజాగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లను చేపట్టింది. గురువారం నాడే సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తారని అంటున్నారు. ఈ సాయంత్రానికి పిటీషన్ దాఖలు చేస్తారని చెబుతున్నారు.
అదే సమయంలో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ సర్కార్ దాఖలు చేసే పిటీషన్లో తాము ఇంప్లీడ్ కావాలా? లేక ప్రత్యేకంగా మరో పిటీషన్ను దాఖలు చేయాలా? అనే విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే ఎదురైతే.. దాన్ని బహిష్కరించే అంశాన్ని కూడా ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఇదివరకే వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇదే అంశాన్ని వారు సుప్రీంకోర్టులో నివేదిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందే- హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో పొందుపరిచిన సారాంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. కేరళ, కర్ణాటకల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహణ విషయాన్ని ప్రస్తావిస్తే.. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా రాష్ట్రాల్లో భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిన అంశాన్ని సుప్రీంకోర్టు ముందుుక తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.