జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్ రిపీట్?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా ఊపుతూ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు గురువారం తీర్పు చెప్పిన కొద్ది గంటలకే జగన్ సర్కారు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుండగా వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరడం ఉత్కంఠ రేపుతున్నది..
ఏపీ సీఎంగా అంజాద్బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర
సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు..
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని తొలినుంచీ వాదిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లోనూ పేర్కొంది. పంచాయితీ పోల్స్ పై హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్లో ప్రభుత్వం కోరింది. కాగా..
హైకోర్టులో వైసీపీకి షాక్..
పంచాయితీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు గురువారం 36 పేజీల తీర్పు ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ తిరిగి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా... హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం వాదనలు విని, గురువారం తీర్పును వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ విధి అని, ఎస్ఈసీకి తప్పనిసరిగా ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఈసీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని పేర్కొంది. నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించబోమంటోన్న వైసీపీకి ఇవాళ్టి హైకోర్టు తీర్పు షాకింగ్ లా మారింది. అంతేకాదు..
తరుముకొస్తున్న గడువు..
పంచాయితీ ఎన్నికలపై తీర్పు సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు ఉన్నాయని, ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది.. ఎన్నికల కమిషనే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ప్రకృతి వైపరిత్యాలు, శాంత్రిభద్రతలకు విఘాతం సమయంలో ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి ఉంటుందని చెప్పింది. ఎలాగైనాసరే ఎన్నికలు నిర్వహిస్తానంటోన్న నిమ్మగడ్డ.. ఇప్పటికే అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23(శనివారం) నుంచి నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. అంటే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు అత్యవసరంగా విచారించాల్సి ఉంది. అయితే..
రాజస్థాన్ తీర్పు రిపీట్ అవుతుందా.
స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించిన దరిమిలా రాజస్థాన్ ఉదంతం చర్చనీయాంశం అయింది. ఇప్పుడంటే కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోందిగానీ, గతంలో కరోనా వైరస్ వ్యాప్తి పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజస్థాన్ లో స్థానిక సంస్థల ఎన్నిలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలకు ఆటంకాలు ఉండరాదని గెహ్లాట్ సర్కారును సుప్రీంకోర్టు మందలించింది. దక్షిణాదిన కేరళలోనూ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఈ అనుభవాల నేపథ్యంలో జగన్ సర్కారుకు సుప్రీంలోనూ చేదు అనుభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మజ్లిస్ పార్టీకి విరాళాల వెల్లువ -ఓవైసీకి దేశమంతటా క్రేజ్ -టీఆర్ఎస్ డేటా రాలేదు -ఈసీ రిపోర్ట్
ఫోటోలు: ఇంటి వద్దకే రేషన్ చేర్చే మొబైల్ వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్