జగన్కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా వ్యవహారం 'నిమ్మగడ్డ వర్సెస్ జగన్'గా మరిన్ని మలుపులు తిరుగుతోంది. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కోరగా, ఆ వినతుల్ని తిరస్కరిస్తూ ఎస్ఈసీ ముందుకువెళ్లారు. ఎలాగైనా సరే నోటిఫికేషన్ నిలుపుదలకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కారుకు నిమ్మగడ్డ తన వ్యాఖ్యలతో ఆయుధాలు అందజేశారనే చర్చ జరుగుతోంది. సోమవారం నాటి సుప్రీంకోర్టు విచారణలో నిమ్మగడ్డ వ్యాఖ్యలనే ప్రభుత్వం ఎత్తిచూపనున్నట్లు తెలుస్తోంది..
Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా
ఏకగ్రీవాలు అక్రమమా?
పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలతో స్వయంగా ఇరుకునపడ్డట్లయిందనే వాదన వినిపిస్తోంది. పంచాయితీ ఎన్నిక ఏకగ్రీ కావడమంటేనే అక్రమాలు చోటు చేసుకున్నట్లేనని, అలా ఏకగ్రీవం అయ్యే పంచాయితీలపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఒక ఐజీ స్థాయిలో ఉండే అధికారి సహకారంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నట్టు నిమ్మగడ్డ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల స్ఫూర్తికి విఘాతమని, టీడీపీ నేతల వాదనను ఎస్ఈసీ వినిపిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అనేక దశాబ్దాలుగా గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ఖర్చు లేకుండా ఎకగ్రీవం అయ్యే పంచాయితీలకు ప్రభుత్వాలు ప్రత్యేక రివార్డును, అదనపు నిధులను కూడా కేటాయిస్తుండటాన్ని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
నాడు అభినందన.. నేడు అనుమానం..
రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికలయ్యే పంచాయతీతకు రూ.20 లక్షల దాకా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ సీఎం జగన్ గతేడాది మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 2 వేల జనాభా లోపు ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.5 లక్షలు, 2వేల నుంచి 5వేల మధ్య జనాభా ఉన్న గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు ప్రోత్సహకంగా ఇస్తామని ఏపీ సర్కారు ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉండే పంచాయితీలు ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, అదే 10వేల పైచిలుకు జనాభా ఉండే పంచాయితీలు ఏకగ్రీవం అయితే రూ.20 లక్షలు రివార్డు ఇస్తామని సర్కారు పేర్కొంది. గతేడాది పంచాయితీ ప్రకటనల సమయంలో ఈ ప్రతిపాదనలను ఎస్ఈసీ నిమ్మగడ్డ స్వయంగా అభినందించారు కూడా. కానీ ఇప్పుడు ఆయనే ఎకగ్రీవాలపై అనుమానాలు వ్యక్తం చేయడం, వాటిని అడ్డుకునే దిశగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తాననడం చర్చనీయాంశమైంది. ఇక..
ఓటర్ల జాబితా సిద్ధంగా లేదంటూనే..
ప్రభుత్వ సహకారంతో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పిన దరిమిలా.. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందడంలేదని, రాజ్యాంగ విలువలకు లోబడే ఎన్నికలు షెడ్యూల్ ఇస్తున్నానని నిమ్మగడ్డ చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో 3.6లక్షల మంది కొత్త ఓటర్లు తమ హక్కును కోల్పోతున్నారని, 2021 ఓటర్ల జాబితా సిద్ధంగా లేకపోవడంతో, 2019 జాబితాతోనే ఎన్నికలకు వెళుతున్నట్లు ఎస్ఈసీ స్వయంగా చెప్పారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఓటరు జాబితాలో లోపాలపై ఎన్నికల అధికారి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు నిమ్మగడ్డ.. ఓటరు జాబితాలో లోపాలున్నాయని తెలిసి కూడా ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసం అనే వాదన వినిపిస్తోంది. ఎన్నికల వాయిదాకు ప్రధాన కారణంగా కరోనా వైరస్, వ్యాక్సినేషన్ ప్రక్రియను చూపుతూనే.. ఏకగ్రీవాలు, కొత్త ఓటర్లు హక్కును కోల్పోతుండటం లాంటి అంశాలను ఏపీ సర్కారు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..
నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె
ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు..
ఏపీ సర్కారుతో తనకు ప్రాణహాని ఉందని, ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. కేంద్రం నుంచి రక్షణను కూడా కోరారు. తాజాగా మరోసారి ఆయన ప్రాణహాని భయాలను వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి వల్ల ప్రాణహాని ఉందని, ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ నిమ్మగడ్డ శనివారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ తన భయాలకు దారి తీసిన ఆధారాలను నిమ్మగడ్డ ప్రస్తావించకపోవడం గమనార్హం. రేపటి సుప్రీంకోర్టు వాదనల్లో ఏపీ సర్కారు ఈ అంశాన్ని కూడా లేవనెత్తబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా నిమ్మగడ్డ తొలి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే వాదనను బలంగా వినిపించబోతున్నట్లు సమాచారం. చివరికి..
త్రిసభ్య బెంచ్ తీర్పుపై ఉత్కంఠ..
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం వెలువరించే ఆదేశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తీర్పు గనుక ఎస్ఈసీకి అనుకూలంగా వస్తే అన్ని స్థాయిల ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగొచ్చని ఉద్యోగ సంఘాల నేతలు హింట్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తెలుగువారైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరావు నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. ఇందులో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా ఉన్నారు.