నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ -సీఎం జగన్ ప్రతివ్యూహాలు -ఏజీతో భేటీ -ఏపీలో ఏం జరగబోతోంది?
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య కొనసాగుతోన్న యుద్ధం క్లైమాక్స్కు చేరింది. ఇంకొద్ది గంటల్లో పంచాయితీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ జారీ కానుంది. ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోనని ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్ ఇవ్వగా, ఎలాగైనాసరే ప్రక్రియను నిలిపేసే దిశగా ప్రభుత్వం ప్రతివ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్, ఎస్ఈసీ నిమ్మగడ్డలు శుక్రవారం కీలక చర్యలకు ఉపక్రమించారు..
Recommended Video
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
నిమ్మగడ్డ వార్నింగ్..
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తానంటోన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. అందుకు ప్రతిభందకంగా తాను భావిస్తోన్న కీలక అధికారులపై ప్రత్యక్ష చర్యలకు ఉపక్రమించారు. అనూహ్యరీతిలో శుక్రవారం నాడు వివిధ జిల్లాలకు చెందిన 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. అంతేకాదు, తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగించారు. ఎన్నికల విధుల నుంచి తొలగించిన ఈ అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లకు నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. శుక్రవారం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ మరో సీరియస్ వార్నింగ్ జారీ చేశారు..
ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టను..
''పంచాయితీ ఎన్నికలకు సంబంధించి శనివారం తొలిదశ నోటిఫికేషన్ విడుదల చేస్తాను. ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)కు ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)కి ఉంటాయి. రాష్ట్రంలోని అధికారులంతా ఎస్ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే. ఎన్నికల కోడ్ను ఎవరూ ఉల్లంఘించకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే ఏ హోదాలో ఉన్నా చర్యలు తీసుకుంటాం'' అని ఎస్ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేశారు. సమావేశం కోసం తాను ఆదేశించిన తర్వాత కూడా పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ లు రాకపోవడాన్ని ఎస్ఈసీ తప్పుపట్టారు. ఇప్పటికే 9 మంది అధికారులపై వేటుకు ఆదేశించిన ఆయన.. తాజా హెచ్చరిక ద్వారా మరింత మంది అధికారులు లేదా ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించినట్లయింది. మరోవైపు..
సీఎం జగన్ తీవ్ర సమాలోచనలు..
పంచాయితీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ దూకుడుగా వెళుతుండటం, ఇంకొద్ది గంటల్లో నోటిఫికేషన్ కూడా వెలువడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే అధికారులపై చర్యలకు నిమ్మగడ్డ ఉపక్రిమించిన దరిమిలా.. శనివారం వెలువడే నోటిఫికేషన్ ను ప్రభుత్వం లెక్కచేయకపోతే ఇంకొందరిపైనా ఎస్ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అడుగు వేయాలనేదానిపై సీఎం కసరత్తు చేస్తున్నారు. నిమ్మగడ్డను ఎదుర్కొనే క్రమంలో న్యాయపరమైన, శాంతిభద్రతలో కూడిన అడ్డంకులు లేదా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఈక్రమంలోనే అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ శుక్రవారం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు.
రేపే నోటిఫికేషన్.. తీవ్ర ఉత్కంఠ..
కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియను కారణాలుగా చూపుతూ పంచాయితీ ఎన్నికలను వాయిదా వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచిస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ సదరు పిటిషన్ను శుక్రవారం వెనక్కిపంపారు. గతంలో కేరళ, రాజస్థాన్ స్థానిక ఎన్నికలపై సుప్రీం తీర్పుల నేపథ్యంలో ఏపీ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ తగలొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ నోటిఫికేషన్ రేపే వస్తుందని ఎస్ఈసీ స్పష్టం చేయగా, దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో ఏం జరగబోతోందనే చర్చ కొనసాగుతోంది..
వన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం" />తిరుపతి ఉపఎన్నిక: వన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం