నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏడాదిగా కొనసాగిన పంచాయితీ ఎన్నికల వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఎన్నికల వివాదంపై ముందు నుంచీ తాను చెప్పింది చెప్పినట్లుగానే జరిగిందని, ఇలాంటి తీర్పు వస్తుందని గతంలోనూ తెలిపానని ఆయన గుర్తుచేశారు. అయితే నిమ్మగడ్డతో పోరు మొదలుకొని కొన్ని వందల కేసుల్లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగలడానికి అసలు కారణాలను ఆయన వివరించారు..
Recommended Video
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
సుప్రీం సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ కు మధ్య నెలకొన్న వివాదంపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకటించింది. కరోనా వైరస్, కరోనా వ్యాక్సినేషన్లను కారణంగా చూపించి ఎన్నికలు వద్దనడం రాజ్యాంగ విచ్ఛిన్నం కిందికి వస్తుందని, ఎన్నికల విషయంలో ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉద్దేశాలు ఆపాదించడం తగదని, ఎస్ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. దీనిపై వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...
ఏపీకి రిపబ్లిక్ ముందుగా..
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన గణతంత్ర దినోత్సం రేపు(26న) అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇవాళ అతిపెద్ద రాజ్యాంగ విజయం నమోదైంది. కొంతకాలంగా రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లుపొడుస్తోన్న తీరును చూస్తున్నాం. నూటికి నూరుశాతం ఎన్నికలు జరుగుతాయని నేను ముందునుంచే చెబుతున్నాను. అంతేకాదు, కోర్టుల్లో ఈ కేసులు మామూములుగా కాదు.. తిట్టి కొట్టివేయబడతాయని స్పష్టంగా చెప్పాను. సరిగ్గా అదే తీరుగా ఇవాళ్టి సుప్రీం తీర్పు వచ్చింది. ఏపీ సర్కారును కోర్టు బాగా తలంటింది.
ముగ్గురు వెధవలు.. మంత్రులు..
ఈ మధ్య కొందరి వెధవ వేషాలు చూస్తున్నాం. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా చెప్పుకునే బొప్పరాజు, వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చిందని ప్రేలాపనలు చేస్తున్నారు. ఈ ముగ్గురు మూర్ఖులు తమను తాము ముగ్గురు మొనగాళ్లు అనుకుంటున్నారు. వీళ్లను తక్షణమే సర్వీసు నుంచి తొలగించాలని సీఎం జగన్ ను కోరుతున్నాను. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపైనా మంత్రులు, కీలక నేతలు జుగుప్సాకరంగా మాట్లాడారు. సీఎం మాత్రం ఏనాడూ మాట్లాడలేదు. బాధ్యత గల స్పీకర్ కూడా అవాకులు చెవాకులు మాట్లాడారు. స్పీకర్ గా ఉండి రాజ్యాంగ సంస్థలను విమర్శించాడు కాబట్టి ఆయనను అనే హక్కు నాకు కూడా ఉందని భావిస్తున్నాను.
151 సీట్లుంటే సుప్రీంకంటే ఎక్కువ!
ఎవరికివారే రాజ్యాంగానికి డెఫినేషన్స్ ఇచ్చుకూంటూ, ఎవరినో ఇప్రెస్ చేయడానికో లేదా మనకు మనమే పోటుగాళ్లం అని చూపించుకోడానికో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వీళ్లంతా ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? సుప్రీం తీర్పు తర్వాత కూడా దిక్కుమాలిన సలహాదారులు, డీజీపీ, సీఎస్ లు ముఖ్యమంత్రికి ఏం చెబుతారో అని నేను ఆందోళన చెందుతున్నాను. మనకు 151 సీట్లొచ్చాయి.. సుప్రీంకోర్టు కంటే ఎక్కువ.. అని ఎవరైనా సీఎం చెవిలో ఊదుతారేమో అని నా భయం. ఇలాంటోళ్లందరి మాటలకు బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలని మెజార్టీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే
జగన్ వైఫల్యానికి అసలు కారణం..
నేను మాత్రం అలా అనను. ఎందుకంటే జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన ప్రజలను, వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. కానీ రాజ్యాంగాన్ని మాత్రం ఇప్పటిదాకా ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయారు. సీఎంగానీ, ఆయన పక్కనున్నవాళ్లుగానీ రాజ్యాంగాన్ని కొంచెమైనా అర్థం చేసుకుని ఉంటే, వైసీపీ ప్రభుత్వం ఇన్ని వందల కేసులు ఓడిపోయే పరిస్థితి ఉండేదికాదు. మంచివాళ్లందరినీ ఫిల్టర్ చేసి, పిచ్చి సలహాలు ఇచ్చేవాళ్లే సీఎం చుట్టూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్ తన సొంత ఆలోచనను నమ్ముకోవాలి. తన చుట్టూ పేరుకుపోయిన చెత్తను సీఎం శుభ్రం చేసుకోవాలి. ప్రజాసంబంధాలు, ఇంకేవో పేర్లతో నియమించుకున్న సలహాదారుల్ని వెంటనే తొలగించాలి. అదే పనిగా ట్వీట్లు చేసేవాళ్లను దూరం పెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రజల వాయిస్ మీదాకా చేరుతుంది.
ఆశించిన దానికంటే అధికంగా..
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం ఆశించిన దానికంటే ఎక్కువగానే జగన్ అందిస్తున్నారు. కానీ అభివృద్ధి మాత్రం కొరవడింది. ఇకనుంచైనా ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలని ప్రజలు కోరుతున్నాను. సరే, గతంలో ఏం జరిగిందన్నది వదిలిపెట్టేసి, ఇవాళ్టి సుప్రీం తీర్పు నుంచైనా మనం పాజిటివ్ గా ముందుకుపోదాం. నిజంగానే కరోనా భయాల నేపథ్యంలోనే ప్రభుత్వం ఎన్నికల వాయిదా కోరి ఉండొచ్చు. అయితే, అందరికంటే ముందే కరోనాను అర్థం చేసుకున్న వ్యక్తిగా, వైరస్ తో సహజీవనం చేయాలన్న తొలి సీఎంగా పరిస్థితిపై ఎక్కువ ఆందోళన అవసరం లేదు. వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికలపై ముందుకే పోదాం. ఇప్పటికి కూడా పనికిమాలిన వెధవల మాట విని, ఎన్నికలు వద్దనే దిశగా నిర్ణయాలు వద్దు.
నిమ్మగడ్డతో శతృత్వం వద్దు..
ఎన్నికల కమిషనర్ ను గవర్నరే నియమించారు. ఆయనను శతృవుగా చూడటం మానేయాలి. నిమ్మగడ్డ రమేశ్ తనకున్న పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా సహకారాత్మక పద్ధతిలో ముందుకుపోదాం. నేను ఆప్ట్రాల్ ఒక ఎంపీని. సీఎంకు సలహాలు ఇచ్చేంత స్థాయి కాదు. గతంలో ఓ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అన్న హోదా అయినా ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా పీకేశారు. వ్యక్తిగత విషయాలకు నాకు బాధలేదు. అయితే మళ్లీ సీఎం రాంగ్ ట్రాక్ లో వెళ్లొద్దన్నదే నా ఆందోళన. అలా జరగాలంటే..
సుప్రీం మళ్లీ రుజువు చేసింది..
ఉద్యోగ సంఘాల ప్రతినిధులం అని చెప్పుకునే ఆ ముగ్గురు మూర్ఖులతోపాటు సీఎం తన సలహాదారులు అందరినీ తొలగించాలి. సోషల్ మీడియాలో, మీడియా ముందు పనికిమాలిన రాతలు, వాగుడు చేసేవాళ్ల నోళ్లు మూయించాలి. పంచాయితీ ఎన్నికల్లో ముమ్మాటికీ విజయం సాధించబోయేది వైసీపీనే అని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులు వేసే పిటిషన్లను న్యాయస్థానాలు ఎంటర్ టైన్ చేయబోమని నేను ముందు చెప్పాను. కనీసం వాళ్ల పిటిషన్ విచారణకు అర్హం కూడా కాదని ఇవాళ సుప్రీంకోర్టే నిరూపించింది. దాన్ని బట్టి వాళ్ల మాటల్లో డొల్లతనం ఇట్టే అర్థమవుతోంది. రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన ఆ ముగ్గురు ఉద్యోగ నాయకులను ముఖ్యమంత్రి కూడా కాపాడలేరు. ఏ ఉద్యోగులను అడ్డంపెట్టుకుని మీరు ఇష్టారీతిగా మాట్లాడారో వాళ్లే బడితపూజ చేస్తారు. ప్రజలు కూడా తంతారు. చివరికి..
జగన్ తక్షణ కర్తవ్యం ఇలా..
ముఖ్యమంత్రికి నా విన్నపం ఏంటంటే.. వెంటనే ముఖ్య అధికారులను పిలిచి మాట్లాడండి. పంచాయితీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇష్టారీతిగా మాట్లాడటం, చీఫ్ సెక్రటరీ సైతం.. సుప్రీం తీర్పు వచ్చేదాకా కలెక్టర్ ఆఫీసులను మూసేసినంత పని చేయడం గర్హనీయం. ఇప్పటికైనా సుప్రీం తీర్పునకు అనుగుణంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించుకుందాం. ఏకగ్రీవాలు తగ్గినా పర్వాలేదుగానీ, ఏపీలో రాజ్యాంగానికి విలువ లేదని కొందరు మేధావులు అంటున్నారు. అలాంటోళ్ల నోళ్లు మూయించాల్సిన సమయం వచ్చింది. ఇకపై పాజిటివ్ గానే వెళ్లాలే. ఒకవేళ సుప్రీంతీర్పుపైనా వ్యతిరేకంగా వెళితే ఇంకా ఇబ్బందులు తప్పవు'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.
తిరుపతి ఉపఎన్నిక: పవన్ రామబాణం -రూ.30లక్షల విరాళం -రాక్షసుడుణ్ని పండితుడంటూ అనూహ్యం