నిమ్మగడ్డ ఆశలన్నీ కలెక్టర్లపైనే -రేపు ఉ.10కి ఇలా జరిగితే జగన్పై పైచేయి -సుప్రీంలోనూ ఎస్ఈసీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఆ మేరకు తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం ప్రకటించింది. కానీ కరోనా నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం, ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లాల వారీగా వెలువడాల్సిన నోటిఫికేన్లపై సందిగ్ధత ఏర్పడింది. అదేసమయంలో సుప్రీంకోర్టులోనూ ఈ వివాదంపై వాదనలు జరుగనున్నాయి...
Recommended Video
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్
సోమవారం నుంచే నామినేషన్లు..
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా ప్రక్రియ చేపడతామని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పారు. ఏపీలో మొత్తం 68 రెవెన్యూ డివిజన్లకు తొలి విడతలో 14 డివిజన్లలోని 146 మండలాల్లో, రెండో విడతలో 17 రెవెన్యూ డివిజన్లలోని 173 మండలాల్లో, మూడో విడతలో 18 రెవెన్యూ డివిజన్లలోని 169 మండలాల్లో, నాలుగో విడతలో భాగంగా 19 రెవెన్యూ డివిజన్లలోని 171 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. దీనికి..
కలెక్టరర్లు నోటిఫికేషన్ ఇస్తేనే..
పంచాయితీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు లేదా రిటర్నింగ్ అధికారులు గ్రామపంచాయతీల ఓటర్ల జాబితాతో నోటిఫికేషన్ ఇస్తేనే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతుంది. జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చినా.. వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని అధికారులు.. రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తారా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే..
అలా జరిగితే నిమ్మగడ్డ సక్సెస్..
ఎన్నికలపై వైసీపీ సర్కారు విముఖంగా ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం సైతం అందుకు అనుగుణంగా ఎస్ఈసీ ఆదేశాలను పెడచెవినపెడుతూ వస్తోంది. అయితే, జిల్లాల కలెక్టర్లలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే, రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసీ ఇచ్చే ఆదేశాలను కూడా పాటించాలనే భావనలో కొందరు కలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్లు జారీ చేయొద్దని ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలిచ్చే పరిస్థితి లేదు కాబట్టి, కలెక్టర్లు విచక్షణ మేరకు వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత వారు ప్రభుత్వ ఆగ్రహానికి గురికావడం అనేది వేరే విషయం. జిల్లాల కలెక్టర్లు అందరూ తనకు సహకరిస్తారనే నమ్మకం ఉందని ఎస్ఈసీ నిమ్మగడ్డ శనివారం నాటి ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. ఆయన ఆశిస్తున్నట్లే సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు ఇస్తే గనుక నిమ్మగడ్డ సగం విజయం సాధించినట్లవుతుంది. కలెక్టర్ల నోటిఫికేషన్లు.. సుప్రీంలో విచారణను ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా,
ఆ గడువు తర్వాతే సుప్రీం విచారణ..
తొలి దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు సోమవారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండగా, ఆ గడువు తర్వాతే.. అంటే, ఉదయం 11 గంటల తర్వాతే సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రానుంది. పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. తొలుత ఈ కేసుల్ని తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేటాయించగా, సవరణలతో సుప్రీం రిజిస్ట్రార్ మరో ప్రకటన చేశారు. తద్వారా ఏపీ పంచాయితీ కేసులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో జస్టిస్ హృశికేష్ రాయ్ సభ్యుడిగా ఉన్న ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లాయి. అదే సమయంలో..
సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేవియట్
పంచాయితీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కౌల్, జస్టిస్ రాయ్ విచారించనుండగా... ఈ వివాదంలో తనను కూడా భాగస్వామిగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు నిమ్మగడ్డ ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణలో తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్ ద్వారా ఎస్ఈసీ కోరింది. ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను ఇచ్చేయడం, సోమవారం ఉదయం జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండటంతో సుప్రీంకోర్టు వెలువరించే ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జగన్కు ఆయుధాలిచ్చిన నిమ్మగడ్డ -ఆ వ్యాఖ్యలతో ఎస్ఈసీ ఇరుక్కుపోయారా? -సుప్రీంకోర్టులో వ్యూహం ఇదే!