నా జీవితంలో నాన్నను కోరిన ఒకే ఒక్క కోరిక అదే!..: లోకేష్
తన కోరిక మేరకే పంచాయితీరాజ్ శాఖను అప్పగించారని, దాంతో పాటు ఐటీ శాఖను కూడా తనకే అప్పగించారని లోకేష్ వ్యాఖ్యానించారు.
అమరావతి: తన జీవితంలో ఇంతవరకు తండ్రిని ఒకే ఒక కోరిక కోరానని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించినప్పుడు.. పంచాయితీరాజ్ శాఖను తనకు కట్టబెట్టాలని కోరినట్లు తెలిపారు. పల్లెటూళ్లకు సేవ చేయాలన్న బలమైన కాంక్షతోనే తాను ఈ కోరిక కోరానని పేర్కొన్నారు.
విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి దినోత్సవం సందర్బంగా మంత్రి నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. అదే సమయంలో తనకు మంత్రిపదవి ఖాయమైన వేళ.. పంచాయితీరాజ్ శాఖనే ఎందుకు ఎంచుకున్నారో చెప్పుకొచ్చారు.
తన కోరిక మేరకే పంచాయితీరాజ్ శాఖను అప్పగించారని, దాంతో పాటు ఐటీ శాఖను కూడా తనకే అప్పగించారని లోకేష్ వ్యాఖ్యానించారు. తనను మంత్రిని చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజనను గుర్తు చేస్తూ.. ఆదాయం తెలంగాణకు, అప్పులు ఆంధ్రాకు మిగిలాయని అన్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన సందర్భమదని గుర్తుచేశారు.
పల్లెటూరుకు సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, అది పరమాత్ముడి సేవతో సమానమని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొత్త మొక్కలు నాటడంలో తూర్పు గోదావరి జిల్లా ముందుందని, రాష్ట్రమంతా ఆ జిల్లాను ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు.