ఏపీ పంచాయతీ పోల్: రెండో విడతకు సర్వం సిద్దం, సెన్సిటివ్ ఏరియాలపై ఫోకస్
మరికొన్ని గంటల్లో ఏపీలో రెండో విడత పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశామని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జీకే ద్వివేది ప్రకటించారు. రెండో దశలో 3,328 పంచాయతీల్లో 539 ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు. 33,570 వార్డు స్థానాల్లో 12,604 ఏకగ్రీవం అయ్యాయని చెప్పారు.
29 వేల పోలింగ్ కేంద్రాలు
రెండో దశ ఎన్నికలకు 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ద్వివేది తెలిపారు. 5,480 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని వివరించారు. 4,181 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. 47,492 మంది సిబ్బందితో రెండో దశ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలింగ్, లెక్కింపు కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ద్వివేది పేర్కొన్నారు.
వెబ్ కాస్టింగ్
రెండోవిడత జరగనున్న పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ పర్యవేక్షణకు ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు అధికారులు చెప్పారు.
2786 పంచాయతీలు
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 167 మండలాలకు సంబంధించిన 2,786 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనునాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 4 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు.
స్పెషల్ కమాండ్ కంట్రోల్ రూమ్
ఎన్నికల విధుల్లో 1292 స్టేజ్ - 1 రిటర్నింగ్ అధికారులు, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, 1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 33835 మంది ప్రిసైడింగ్ అదికారులు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47,492మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ కోసం 32, 141మంది సిబ్బంది ఉండగా, జిల్లాకి ఒకరు చొప్పున 13 మంది పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులను కౌంటింగ్ అబ్జర్వర్లుగా నియమించారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్, డీజీపీ కార్యాలయాల్లో స్పెషల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు.