మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ..టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్త ఘటనలు, కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ కొనసాగుతోంది. అనేక ఉద్రిక్తతల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలలో 7,506 సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్నారు ఇక 20,157 వార్డు సభ్యుల స్థానాల కోసం 43,601 మంది పోటీలో ఉన్నారు.
Recommended Video
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడులో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
ఏపీలో ఎన్నికల కొనసాగుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ఆందోళనలు, టిడిపి, వైసిపి ల మధ్య ఘర్షణ లతో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉద్రిక్తతలకు కారణమైన పలు ఘటనలను చూస్తే కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరుపాడు పంచాయతీ లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ జరుగుతున్న 9వ వార్డులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం వివాదానికి దారి తీసింది. నాయకులు పరస్పరం తోపులాటకు దిగడంతో, అక్కడ ఉన్న స్థానికులతో పాటు పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు.
కర్నూలు జిల్లా ముత్తలూరు లోనూ , చిత్తూరు జిల్లా కమ్మ కండ్రిగలోనూ ఘర్షణ
ఇక చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం కమ్మ కండ్రిగలో టిడిపి ఆందోళన చేసింది. ఓటర్ స్లిప్పులపై ఎన్నికల గుర్తులు రాసి పంపుతున్నారని నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు పట్టించుకోవడం లేదని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని సర్పంచ్ అభ్యర్థి ఆందోళన చేశారు.కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముత్తలూరు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని పరస్పర ఆరోపణలు దిగడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తం .. కత్తులతోనే దాడులకు దిగిన ఇరువర్గాలు
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట లో టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో, అది కాస్త చిలికి చిలికి గాలివాన అయింది . పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది . పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు .
మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు , నెల్లూరు జిల్లాలో ఓటర్లు ఎన్నికల బహిష్కరణ
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుక పాలెం పంచాయతీ లోని శంభుని పాలెం గ్రామంలో ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు . కుల ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకపోవడంతో అధికారులు కొందరు నామినేషన్లను తిరస్కరించారని దీంతో గ్రామస్తులు ఆగ్రహించి ఎన్నికలను బహిష్కరించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కేసు నమోదు చేశారు పోలీసులు. మచిలీపట్నం పొట్లపాలెం సర్పంచ్ అభ్యర్థి నాగరాజును బెదిరించారన్న ఆరోపణలతో కొల్లు రవీంద్ర తో పాటు మరో ముగ్గురు పై కేసు నమోదు చేశారు.
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సర్పంచ్ అభ్యర్థి తిరిగి ప్రత్యక్షం
ఇదే సమయంలో ఈ నెల 6వ తేదీ నుంచి అదృశ్యమై ఎల్ఎం కండ్రిగ సర్పంచ్ అభ్యర్థి మునిరాజు ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా వడమాలపేట పోలీస్ స్టేషన్ ఎదుట ప్రత్యక్షమయ్యారు . ఎన్నికల్లో పోటీ చేసిన మునిరాజును ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని ఆయన భార్య ఆరోపించగా , మునిరాజు మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ మినహాయించి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.