మీరేదో అనుకొని: పురంధేశ్వరిపై అనురాధ ఆగ్రహం, కాంగ్రెస్ సహా కలుస్తామని కీలకవ్యాఖ్య
అమరావతి: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పొత్తుపై మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి ఆత్మవిమర్శ చేసుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యతిరేకించిన పార్టీలో ఆమె ఉన్నారని గుర్తు చేశారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా పురంధేశ్వరి వ్యవహరించారని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీలో కొనసాగుతున్నారని నిప్పులు చెరిగారు.
అది గుర్తుంచుకోవాలిగా.. షాకిస్తున్నారు: కన్ఫ్యూజన్గా పురంధేశ్వరి వ్యాఖ్యలు!
ఆమె ఏదో భావించుకొని మాట్లాడితే ఎలా?
అలాంటి పురంధేశ్వరి పొత్తులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని పంచుమర్తి అనురాధ అన్నారు. అసలు తమ పార్టీ పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె వెల్లడించారు. తాము కాంగ్రెస్ పార్టీతో జట్టు కడుతుందని భావిస్తూ ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు.
Recommended Video
కేంద్రమంత్రి పదవి అనుభవించినప్పుడు మాటేమిటి?
ఎన్టీఆర్ పైన, ఆయన ఆశయాల పైన అంత ప్రేమ ఉన్న పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రి పదవి ఎందుకు అనుభవించారో చెప్పాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. ఆ రోజు ఆమెకు టీడీపీ ఆత్మగౌరవం, ఎన్టీఆర్ ఆత్మ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
అన్యాయం చేసిన బీజేపీలో కొనసాగుతున్నారు
అంతేకాదు, ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్కు, తెలుగు వారికి అన్యాయం చేసిన బీజేపీలో కొనసాగుతున్నారని, పంచుమర్తి అనురాధ అన్నారు. కేంద్రంలో బీజేపీ నమ్మకద్రోహాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని తమ పార్టీ చెప్పిందని ఆమె అన్నారు. ఏపీ హక్కులపై రాష్ట్ర బీజేపీ నేతలు తమ పార్టీని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు.
పురంధేశ్వరి ఏమన్నారంటే?
ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్ - టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తానని పురంధేశ్వరి అన్నారు. టీడీపీ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అన్నారు. ఆ రెండు పార్టీలు ఎలా పొత్తు పెట్టుకుంటాయని ప్రశ్నించారు. అదే సమయంలో విభజన సమయంలో ద్రోహిలా కనిపించిన కాంగ్రెస్ ఇఫ్పుడు టీడీపీకి ఎలా నచ్చుతోందని ప్రశ్నించారు. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు విషయమై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా స్వాగతిస్తారో చూడాలన్నారు. ఈ రెండు పార్టీల పొత్తును ఎన్టీఆర్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తారన్నారు. వీరి పొత్తుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.