ఓటమి ఖరారు, అందుకే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: అనూరాధ
రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పంచుమర్తి అనూరాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్తాయి విమర్శలు ఎక్కుపెట్టారు.
విజయవాడ: రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పంచుమర్తి అనూరాధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్తాయి విమర్శలు ఎక్కుపెట్టారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఖరారు కావడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహిళలను మోసం చేసింది ఆయనే..
ఆదివారం మీడియాతో అనురాధ మాట్లాడుతూ.. మహిళలకు అన్నివిధాలా మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా ప్రతి మహిళకు రూ.10వేలు డ్వాక్రా రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పేరుతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు.
Recommended Video
అప్పుడే నేరాలు అధికం..
మైక్రో ఫైనాన్స్ సంస్థల బారినపడి 200 మంది మహిళలు నాడు ఆత్మహత్యకు పాల్పడ్డారని గుర్తుచేశారు. వైయస్ హయాంలో మహిళలపై నేరాల విషయంలో ఏపీ నెం.1 స్థానంలో ఉండేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు అన్నివిధాలా అండగా నిలుస్తోందని, స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లతో పాటు వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
బాబు అండగా..
రాష్ట్ర మహిళా కమిషన్ను ఏర్పాటు చేసి చంద్రబాబు అండగా నిలిచారన్నారు. మహిళల పేరుపై ఇళ్లస్థలాలు, రుణాలు, పట్టాలు ఇచ్చారని, రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్లు, ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షా 6వేల మంది అంగన్వాడీ వర్కర్లకు జీతాన్ని రూ.3400 నుంచి 7200కు పెంచారని తెలిపారు.
జగన్కు గుణపాఠం తప్పదు
అంతేగాక, మాతా-శిశు మరణాలు తగ్గించేందుకు బాలామృతం పేరుతో 3.45 లక్షల మందికి పోషకాహారం అందిస్తున్నారని ఆమె చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి పట్ల, అఖిలప్రియ పట్ల వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు జగన్, రోజా మాట్లాడుతున్న మాటలను చూసి మహిళా సమాజం వారిని అసహ్యించుకుంటోందని అనురాధ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వారికి ఓటర్లు తగిన గుణపాఠ: చెబుతారని హెచ్చరించారు.