కల్లు తాగిన కోతుల్లా .. అవినీతి మరక అంటిస్తారా ... చర్చకు రాగలరా : సవాల్ చేసిన పంచుమర్తి అనూరాధ
ఐటీ దాడులకు టీడీపీ నేతలకు సంబంధం ఉందంటూ , టీడీపీ అవినీతి రాకెట్ గుట్టు రట్టు చేసింది ఐటీ శాఖ అంటూ వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఖండించారు. అసలు ఐటీ దాడులకు, టీడీపీకి సంబంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా టీడీపీ నేతల పేర్లు ప్రస్తావనకు రాకపోయినా సరే వైసీపీ నేతలు కల్లుతాగిన కోతుల్లా తమ పార్టీకి అవినీతి మరకలను అంటించే ప్రయత్నం చేస్తున్నారని అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఐటీ దాడుల రగడ ... వైసీపీ జప్ఫాలు.. ఐటీ దాడులకు టీడీపీకి లింక్ ఏంటి ? టీడీపీ ఫైర్
వైసీపీ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్న అనూరాధ
అవినీతిలో ఆరితేరిన నేతలు తమ అధినేతను విమర్శించడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు అనూరాధ . ఇక తమ పార్టీ అవినీతి మాట అటుంచి వైసీపీ అధినేత జగన్ కేసులపై, అవినీతిపై చర్చకు రాగలరా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు పంచుమర్తి అనూరాధ . ఇక వైసీపీ నేతలు వారే దొంగలై పక్క వాళ్ళను దొంగా, దొంగా అంటున్నారని ఆమె ఆరోపించారు . దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా టీడీపీకి అంటగట్టడమేంటని నిలదీశారు .
టీడీపీ పై అవినీతి మరకలు వెయ్యాలని కుట్ర
2012 నుంచి జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు అని , ఇక జగన్ కు కోర్టు అక్షింతలు వేస్తున్నా అక్రమాస్తుల కేసులో జగన్ గైర్హాజరవుతున్నారన్నారు. ఇంత అవినీతి ముఖ్యమంత్రిని తమవైపు పెట్టుకుని టీడీపీ పై బురదజల్లడమేంటని ఆమె ప్రశ్నించారు . టీడీపీ పై అవినీతి మరకలు వెయ్యాలని చూస్తున్నారని పేర్కొన్నారు . 35 వారాలు కోర్టు కెళ్లకుండా సాకులు వెతుక్కుంటున్నాని పేర్కొన్న అనూరాధ నిస్సిగ్గుగా నేడు కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నా కోర్టుకు హాజరు కాకుండా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు .
దోపిడీ చక్రవర్తులకు తమ అధినేతను విమర్శించే స్థాయి లేదన్న అనూరాధ
టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు .ఇక సీఎం జగన్ మొత్తం 16 కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన అనూరాధ ఈ విషయాలపై వైసీపీ నేతలు నోరు మెదపరేం అని విమర్శించారు . ఉమ్మడి ఏపీలో మొత్తం 2.75లక్షల ఎకరాలని వైఎస్ జగన్ కొట్టేశారని ఆరోపించారు. అలాంటి దోపిడీ చక్రవర్తులకు తమ అధినేతను విమర్శించే స్థాయి లేదని పేర్కొన్నారు అనూరాధ .
నిరాధారమైన ఆరోపణలు చేసి చంద్రబాబుని ఏం చెయ్యలేరన్న టీడీపీ నేత
సవాల్ విసిరితే సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు టీడీపీ నేతలను విమర్శించటం హాస్యాస్పదం అన్నారు . చంద్రబాబుపై అవినీతి మారక అంటించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 విచారణలు జరిపి ఏమీ చేయలేకపోయారన్నారు. 2006 పేజీలతో విజయమ్మ సుప్రీం కోర్టుకు వెళితే అవన్నీ నిరాధారమైనవని సుప్రీం కోర్టు పేర్కొన్న విషయాన్ని మరచిపోయారా అని అనూరాధ గుర్తు చేశారు . మొత్తానికి ఐటీ దాడులకు టీడీపీకి సంబంధం ఉందని మాట్లాడుతున్న వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు టీడీపీ మహిళా నాయకురాలు అనూరాధ .