చితకొట్టిన పోలీసులు, ఒకరు మృతి... మొండెం వదిలి తలను తీసుకెళ్లారు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. టికెట్ లేదన్న కారణంతో 13 మంది ప్రయాణికులను రైల్వే పోలీసులు చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
మృతి చెందిన ప్రయాణికుడిని కర్నూలుకు చెందిన వెంకటేశ్ (29)గా గుర్తించారు. వలస కూలీగా జీవనం సాగిస్తున్న వెంకటేశ్ కర్నూలు నుంచి గుంటూరుకు వెళుతున్న క్రమంలో పోలీసుల చేతిలో మరణించాడు. కాగా మృతుని భార్య రైల్వేస్టేషన్ బుకింగ్ హాల్ వద్ద ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ దారుణ హత్య
కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బండి ఆత్మకూరు మండలం కోడూరులో ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. వెంకటేశ్వర్లును తల నరికి హత్య చేసిన దుండగులు మొండెం వదిలి తలను తీసుకెళ్లారు. ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు ఈ నెల 12న అదృశ్యమయ్యాడు.
సెలవుల కోసమని కర్నూలు వచ్చిన వెంకటేశ్వర్లు తిరిగి వెళుతున్న క్రమంలో అదృశ్యమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ హత్యకు పాల్పడిందెవరన్న విషయంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.