పోలవరం రోడ్డులో కళ్లముందే, హఠాత్తుగా భారీ పగుళ్లు, జనం పరుగులు: వీడియోతో బాబును నిలదీసిన పవన్
పోలవరం: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు మార్గంలో రోడ్లకు భారీగా పగుళ్లు వచ్చాయి. భూమి పగుళ్ల కారణంగా కరెంట్ స్తంభాలు కూడా కూలిపోయాయి. తొలుత భూకంపం, భూప్రకంపనల కారణంగా ఇవి వచ్చాయనే ప్రచారం సాగింది. దీంతో ప్రజలు ఆందోళన చెందారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గం పూర్తిగా దెబ్బతినడంతో పాటు రోడ్డు కుంగిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. పగుళ్ల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబూ! దీనికి సమాధానం చెప్పండి
ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ పగుళ్లు భయానకంగా ఉన్నాయి. పక్కనే పూరిళ్లు కూడా ఉన్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. పోలవరంప్రాజెక్టుకు కేవలం కిలో మీటరు దూరంలో రోడ్డు ఎలా పగుళ్లు పట్టాయో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తెలుస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. భూకంపం లేదా ప్రకంపనలు వస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తోందని చెప్పారు. ఇలా ఎందుకు జరిగిందో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని చెబుతూ పవన్ పగుళ్లకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.
హఠాత్తుగా కుంగిపోయింది
కాగా, పోలవరం గ్రామం సమీపం నుంచి ఏజెన్సీకి వెళ్లే మెయిన్ రోడ్డు హఠాత్తుగా కుంగిపోయింది. పెద్ద పెద్ద నెర్రెలు కనిపించాయి. శనివారం ఉదయం పది గంటల సమయంలో కడెమ్మ వంతెన వద్ద ఉన్న పోలీసు చెక్పోస్టుకు కూతవేటు దూరంలో జరిగిన ఘటన ఈ ప్రాంతంలో భయాందోళనకు, కలకలానికి కారణమైంది.
భారీ పగుళ్లు, భయంతో పరుగులు తీశారు
భూమికి పగుళ్లు రావడంతో విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. తీగలు తెగిపోయాయి. పోలవరం నుంచి పలు ఏజెన్సీ గ్రామాలకు ఈ రోడ్డు ఆధారం. అలాగే, ప్రాజెక్టులోకి అవసరమైన సామగ్రి, యంత్రాలు తీసుకు వెళ్లాలన్నా ఇదే రోడ్డు నుంచి వెళ్లాలి. అలాంటి ఈ మార్గంలో ఏకంగా 75 మీటర్ల పొడవునా, 6 మీటర్ల లోతున భూమికి పగుళ్లు వచ్చాయి. దీంతో పక్కనే తాత్కాలికంగా నిర్మించిన పాకల నుంచి అందరూ పరుగు తీశారు.
భూకంపం వచ్చిందని భావించి పరుగులు
భారీ పగుళ్ల కారణంగా ఏజెన్సీ గ్రామాలకు రవాణా నిలిచింది. కనీసం సైకిల్ కూడా తిరిగే పరిస్థితి లేదు. స్తంభాలు నేలకు ఒరగడంతో విద్యుత్ నిలిచింది. పాపికొండలను చూసేందుకు వచ్చిన టూరిస్టులు ఇబ్బంది పడ్డారు. అధికారులు వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు. కొందరు తమ కళ్లెదుటే భూమి కుంగిపోవడం చూసి భూకంపం వచ్చిందని, భూ ప్రకంపనలు వచ్చాయని పరుగులు తీశారు. దాదాపు అరగంట పాటు రోడ్డు బీటలు వారడం, పక్కకు ఒరిగిపోవడం జరిగింది.