చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న గౌరు దంపతులు
అమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీలో వారు అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడుతున్నట్లు ఈ మధ్యనే గౌరు దంపతులు ప్రకటించారు. ఈ క్రమంలోనే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులు అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. గౌరు చరితా రెడ్డి దంపతులతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు టీడీపీలో చేరారు.
ఇక టీడీపీ పార్టీలో చేరిన తర్వాత గౌరు చరితా మాట్లాడారు. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్లు వెల్లడించారు. ఇక కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్న చరితా రెడ్డి గుండ్లేరుకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చి దిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ఏపి మీ తాతదా..మేము వస్తాం : అది నిజమైతే రాజీనామా చేస్తా : బాబు కు తలసాని సవాల్..!
అంతకుముందు పాణ్యం నియోజకవర్గం నుంచి కర్నూలు కార్పొరేషన్ కల్లూరు అర్బన్ వార్డులు, రూరల్, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల నుంచి 500 వాహనాల్లో గౌరు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అమరావతికి చేరుకున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం ప్రజావేదికలో గౌరు దంపతులు టీడీపీలో చేరారు. గౌరు కుటుంబం వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన కుటుంబంగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటాయి. 1999లో నందికొట్కూరు నుంచి కాంగ్రెస్ నుంచి పోటీచేసిన గౌరు వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి గౌరు చరితా రెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల సమయానికి నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. అనంతరం 2014లో పాణ్యం నుంచి పోటీ చేసిన గౌరు చరితా రెడ్డి విజయం సాధించారు. అయితే కాటసాని వైసీపీలోకి రావడంతో పాణ్యం నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. గౌరు చరితా రెడ్డికి ఈసారి టికెట్ రాదని ప్రచారం జరగడంతో అలకబూనిన దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.