పరిపాలనా రాజధాని విశాఖలోని ఆ ప్రాంతంలోనే..! ఏది ఎక్కడో నిర్ణయించారా: జూన్ నాటికి పూర్తయ్యేలా..!
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని ఉండవచ్చంటూ ఇచ్చిన సంకేతాలతో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నోట ఆశామాషీగా పరిపాలనా రాజధాని విశాఖ అనే మాట రాదని..ఖచ్చితంగా అక్కడ అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తరువాతనే ముఖ్యమంత్రి ప్రజలను మానసికంగా సిద్దం చేసేందుకే ఈ ప్రకటన చేసారనే ప్రచారం సాగుతోంది.
ఇదే సమయం లో విశాఖ పరిపాలనా రాజధాని అని స్వయంగా సీఎం చెప్పటంతో..విశాఖలోని ఆ ప్రాంతంలోనే కీలక పాలనా కేంద్రాలు ఉంటాయంటూ ప్రభుత్వ వర్గాల్లోచర్చ మొదలైంది. అందకోసం సచివాలయంతో పాటుగా ఇతర కేంద్రాల ఏర్పాటుకు స్థలాలు..ప్రాంతాలు..భవనాలు సైతం సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. గవర్నర్ కు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు అందిర చూపు విశాఖ మీద ఫోకస్ అయింది. కమిటీ నివేదిక తరువాత సీఎం దీని పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పరదేశీపాలెం కేంద్రంగా పాలన..!
ఇప్పటికే రాజధానితో పాటుగా నగరాల పైన అధ్యయనం..సూచనల కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ సైతం దీని పైన ఫోకస్ చేసినట్లుగా సమాచారం. గ్రేటర్ విశాఖ పరిధిలోని పరదేశీపాలెం ఇప్పుడు పాలనా కేంద్రంగా మారనుందని తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ భూములతో పాటుగా దేవాదాయ శాఖకు చెందిన భూములు సైతం ఉన్నాయి. ఇక్కడ వైయస్ హాయంలో తొలి సారిగా లాండ్ పూలింగ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక్కడ నుండి పాలన సాగించాలంటూ పెద్దగా భూముల కోసం..భవనాల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అధికారులు ప్రాధమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజ్ భవన్ కోసం ప్రత్యేకంగా ఒక భవనం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. గవర్నర్ ఉండేందుకు రాజ్ భవన్ ఖరారు అయ్యే వరకూ సర్క్యూట్ హౌస్ ను తాత్కాలిక రాజ్ భవన్ గా వినియోగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దీంతో..పదేశీపాలెం అదే విధంగా కాపులప్పాడు వద్ద ఉన్న స్థలాల మీద కూడా ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
రెండు వేల ఎకరాలు..రెండున్నార లక్షల చ.అడుగుల భవనం..
విశాఖను అధికారికంగా పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత ఎక్కవ సమయం తీసుకోకుండా..అక్కడ నుండి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పరదేశీపాలెంతో పాటుగా సమీపంలో దాదాపు రెండు వేల ఎకరాల భూమి సిద్దంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీంతో పాటుగా విశాఖలో సాఫ్ట్ వేర్ వ్యాపారం కొనసాగిస్తున్న విజయవాడకు చెందిన ఒక ప్రముఖ నేత తనకు చెందిన రెండున్నార చదరపు అడుగుల భవనాన్ని ప్రభుత్వం వినియోగించుకొనేందుకు వీలుగా ముందుకొచ్చారని సమాచారం. అదే విధంగా.. ఇటు విశాఖ విమానాశ్రయంతో పాటుగా భోగాపురం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాతో డెవలప్ చేస్తూ..పూర్తిగా అక్కడి రూపు రేఖలు మారిపోతాయని..పెట్టుబడులకు భారీగా అవకాశాలు ఉంటాయని ప్రభుత్వంలోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్దం అయినట్లు సమాచారం.
భీమిలిలో సీఎం నివాసం.. ఏయూలో సైతం
ముఖ్యమంత్రి నివాసం కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భీమిలి వద్ద తీరం సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఒక భవంతిని ముఖ్యమంత్రి నివాసంగా ఎంపిక చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కొన్ని భవనాల ను సైతం తక్షణ అవసరాల కోసం వినియోగించుకొనేందుకు వీలుగా ఇప్పటికే రెవిన్యూ అధికారుల నుండి సమాచారం సేకరించినట్లుగా చెబుతున్నారు.
అయితే, పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం పూర్తయిన తరువాతనే ఈ రకంగా విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. మరో వారం పది రోజుల్లో వీటికి సంబంధించి అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.